గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జూన్ 2010, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 95

శ్లోll
నిత్యాన్నదాతా నిరతాగ్నిహోత్రీ వేదాంతవిణ్మాస సహస్ర జీవీ
పరోపకారీచ పతివ్రతాచ షట్ జీవ లోకే మమ వందనీయా:.
ఆ.వెll
అన్నదాతయు; ప్రథిత నిత్యాగ్ని హోత్రి;
వేదసంపన్నుఁడును; వయో వృద్ధ నరుఁడు;
పరుల కుపకారి; నుత పతి వ్రతయు నాకు
వందనీయులు. భువి పైన భాగ్యనిధులు.
భావము:-
పేదవారికి నిత్యము అన్నదానము చేయువాఁడును; నిత్యాగ్నిహోత్రియు; వేదాంత వేత్తయు; సహస్ర చంద్ర దర్శనము చేసినవయో వృద్ధుఁడు; పరోపకార పరాయణుఁడు; మహా పతివ్రత; ఈ ఆరుగురూ నాకు వందనీయులు.
(ఈ క్రింది శ్లోకము మేలిమి బంగారం మన సంస్కృతి 28. పొరపాటున పునరుక్తమైనది)
శ్లోll
సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం
ద్వయమేతద్ధి జంతూనాం అలంఘ్యం దిన రాత్రవత్.
ఆ.వెll
పగలు రాత్రి వోలె ప్రబలును సుఖ దుఃఖ
ములు సతతమును జీవనులకు; నిజము.
ధరణి పైన మనకు దురతిక్రమములివి.
విజ్ఞు లెఱిగి మెలగు భీతి విడిచి.
భావము:-
రాత్రింబవళ్ళ వలె సుఖము తరువాత దుఃఖము; దుంఖము తరువాత సుఖము వచ్చుచునే యుండును. జీవులకీ రెండునూ తప్పని సరైనవి. ఇక వీనికై వివేకి యైన వాఁడు దుఃఖము నొందడు.
జైహింద్. Print this post

4 comments:

సురేష్ బాబు చెప్పారు...

బాగుందండి, చదువుతుంటే క్రింది శ్లోకం గుర్తొచ్చింది.

దుఃఖే ష్వనుద్విగ్నమనా స్సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీ ర్మని రుచ్యతే

ప్రణీత స్వాతి చెప్పారు...

భావం చాలా బాగుంది.

గురువుగారూ చిన్న సందేహం..

శ్లో!! అని పెట్టి రాశారు, ఆ.వె అని పెట్టి రాశారు..రెండూ వేరు వేరు పద్యాలా..? లేక ఒకదాని కంటిన్యుయేషన్ మరొకటా..?

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

బాగుందండి.....మీరు రాసే పద్యాలు బాగుంటాయండి..ధన్యవాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రణీతస్వాతిగారూ!
శ్లోll అంటే సంస్కృత భాషలో వ్రాయ బడిన ప్రసిద్ధమైన శ్లోకము.
అ.వె. అంటే ఆట వెలది. లేదా గీ అన్నా తే.గీ. అన్నా తేట గీతి పద్యము అని తెలుసుకొనవలసుంటుంది.
ఈ తెలుగు పద్యాలు మీ రేవైతే శ్లోll అని ఉందన్నారో ఆ శ్లోకానికి నేను అనువదిస్తూ వ్రాసిన తెలుగు పద్యమన్నమాట.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.