గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఫిబ్రవరి 2010, ఆదివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 90.

ఆంధ్రామృత పాన లోలులారా! ఆంధ్ర భాషాభిమానులారా!
హితం మనోహారిచ దుర్లభం వచ: అని విన్నాం కదా! ఇప్పుడు మరొక చక్కని శ్లోకంలో మనలను మేలుకొలుపుతున్నాడీ కవి. చూద్దాం.
శ్లోll
లభ్యతే ఖలు పాపీయాన్ నరో సుప్రియ వాగిహ
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభఃll
గీll
తీపి మాటలు చెప్పుచు పాపులిలను
మోసగింతురు. కనుఁ డది మోస మనుచు.
కఠిన సత్యము పలుకఁగ, కరుణ వినగ;
కలుగు వారలు తక్కువ కలరు భువిని. 
భావము:-
తీయని మాటలచే మోసపుచ్చు పాపులు ఈ లోకంలో సర్వత్రా ఉన్నారు. కాని కటువైనను పథ్యముగా ఉండే మాటలు చెప్పు వారు, విను వారు  కూడా లోకంలో అరుదుగానే ఉంటారు కదా!
తీపిగా మాటాడే మోసగాళ్ళున్నారని గ్రహించుదాం. వారి మాటల మత్తులో పడితే మోసపోవడం ఖాయం.
మన క్షేమమును కోరుచు  యదార్థమును చెప్పెడి వారి మాటలు కఠినతరమైనను అప్రియమైన వైనను ఓర్పుతో విని; నిజాన్ని గుర్తించి అనుసరించడం మనకు శ్రేయస్కరం.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.