గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఏప్రిల్ 2016, శనివారం

3-4-2016వ తేదీని జోళదరాశిలో జరిగిన అష్టావధాన చిత్రమాలిక.

జైశ్రీరామ్.

అవధాని : అవధానరత్న డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ 
అవధానానికి ముందు చెప్పిన పద్యాలు
శ్రీ గుత్తి నారాయణ రెడ్డి సాహితీ పీఠంవ్యవస్థాపకాధ్యక్షులు
శ్రీ గుత్తి చంద్రశేఖరరెడ్డి గారి గురించి :
ఆయత దానధర్మములకాస్పదులై జనులెల్ల మెచ్చగా 
స్వీయ యశమ్ము శాశ్వతము వెల్గగ శ్రీయుత చంద్రశేఖరుం 
డీ యజనమ్ముఁ దల్చుచునభీప్సిత సాహితి పీఠమేర్పడం 
జేయ కళాసరస్వతి వసింపగగల్గె ధరిత్రి గుత్తి నా
రాయణ రెడ్డి పుత్రుడని ప్రాజ్ఞుడటంచు నమస్కరించెదన్.
సంచాలకులు శ్రీ సదానంద శాస్త్రి గారిని గురించి :
అనవద్యంబగు సంస్కృతాంధ్రములయందష్టావధానక్రియన్ 
ఘనసత్కారములందియున్ ప్రవిలసత్ కర్ణాటభాషన్ఒగిం
జనునట్లున్ యవధానమున్ నిలిపె తానై శ్రీ సదానందశా 
స్త్రిని సంచాలకు సన్నుతింతు మది యాశీర్వాదముల్ గోరుచున్.
ముఖ్య అతిథి శ్రీ కృష్ణదేవరాయలు గురించి :
శ్రీమాన్యంబగు ఆరవీటి కులవార్ధిన్ చంద్రుడై ధాత్రిలో 
ప్రేమస్వాంతుడునై ఉదారమతియై విద్వత్సభాధ్యక్షులై 
ధీమంతుండగు కృష్ణరాయలలరన్ తేజోయశోపేతులై 
నేమంబొప్ప నమస్కరింతునితనిన్ నిశ్శ్రేయసమ్మొందగన్.
అవధాన ప్రారంభము :
1.నిషిద్ధాక్షరి :
గిరిజా కళ్యాణం :
శ్రీ వాక్కైయుండుదువో
నీవే నిన్ భద్రుతోనె నేనెంతున్ భో
కావించెద కళ్యాణము
భావింపుము నాదు శుభము భవ్యా గౌరీ! 
2.దత్తపది :
శ్రీ కృష్ణునికి ఇప్పుడు సభలో  ముఖ్య అతిథిగా ఉన్న శ్రీ కృష్ణదేవరాయలుకు ఉన్న సామ్య,భేదములను
కల్లుబీరుసార,రమ్ము అనే పదాలతో చంపకమాలలోవర్ణించాలి.
తరుణికి రాధకల్లుడయి తాఁ మురిపించుచు నాడు కృష్ణుడే
వెరవక బీరులెల్లరల పీచమడంచుచు రుక్మిణిన్ గొనెన్
మరుసటిజన్మ వీరలిట మాన్యులునై మనసార మెచ్చగా 
పరిణయమాడిరేకయగు పత్నిని రమ్మని కృష్ణరాయలే.
3. సమస్య :
దీర్ఘ సుమంగళీయనుచు దీవెనలిచ్చిరి భర్తృహీనకున్ .
దీర్ఘముగాకపోవునొకొ ? ధీరులు మెచ్చుచు దీవెనివ్వరే 
దీర్ఘ సుమంగళీయనుచు దీవెనలిచ్చిరి భర్తృహీనకున్ 
ఘుర్ఘురులెన్ననేల?  తరిగొండను వంశజ వేంగమాంబకున్ 
వార్ఘనులైనవారెగద ! పాయదదెప్పుడు పండితోత్తమా !
4.వర్ణన :
మేమిచ్చిన అంశాలకు మీరు చెప్పిన పద్యాలను మెచ్చుకొని
మేఘుడు వర్షించినట్లు వర్ణించాలి.
పృచ్ఛకోత్తములెల్లరు వేడ్కమీర 
ప్రశ్న వేయంగ నాదైన పాండితిగని 
పుష్ప వర్షంబుగురిపించెపో ఘనుండు
వసుధ పండితులెల్ల శెభాషనంగ.
5.ఆశువులు :
1.గుత్తి నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సాహితీ పీఠాన్ని 
చంద్రశేఖరరెడ్ఢి గారు వృద్ధిలోకి తెస్తున్నారని వర్ణించాలి.
గుత్తి  నారాయణుడు తానుగోరుకొనుచు 
సాహితీపీఠముంగూర్చె మోహనముగ
చంద్రశేఖరరెడ్డియు సాదరముగ 
పెంచిపోషించె పండితుల్ భేషనంగ. 
2. శ్రీ రామేశాంజనేయ స్వామిని స్తుతిస్తూ పద్యం చెప్పాలి.
శ్రీరామున్ జనకాత్మజాహృదయనీరేజాతమార్తాండు, దు
ర్వారప్రోత్థిత రావణాద్యసుర క్రూరవ్రాత సంహారు, శ్రీ
మారుత్యాది సమస్తభక్త వరదున్ మందస్మితాస్యున్ సదా
శ్రీ రామేశహనూమతాలయ నివాసింగొల్తునిష్టాప్తికై.
6.వ్యస్తాక్షరి : 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
7. పుష్ప గణనం: 12
8.అప్రస్తుత ప్రసంగము
అవధానానంతరం కృతజ్ఞతలు తెలియజేస్తూ -------
జోళదరాశి గ్రామమున సూరిజనుల్ అవధాన కార్య స 
మ్మేళనమాదరమ్ముగజుమీ జరిపించిరి, శ్రీ సరస్వతీ 
కాళికలక్ష్మి మువ్వురును ఖాయముగా జయమందజేసిరే
పాలునుఁ బంచుకొండనుచు పల్కెద మీకిదె ధన్యవాదముల్.  
దీనితో అవధానం మంగళాంతమైంది.
ఇంత అద్భుతంగా అవధాన ప్రతిభాపాటవాలను కనబరచి ప్రేక్షకులను రంజింపఁ జేసిన డా.మాడుగుల అనిల్ కుమార్ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమమును నిర్వహించిన గుత్తి వంశజులైన శ్రీ చంద్రశేఖరరెడ్డిగారిని మనసారా అభినందిస్తున్నాను. అత్యంత నైపుణ్యముతో కార్యక్రమమును రక్తికట్టించిన సంచాలకులవారికి నా నమోవాకములు.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అష్టావధాన సాహితీ కార్యక్రమ విశేషములను కన్నుల కింపగు చిత్రములతొ వీనుల విందుగా " సమస్య,దత్తపది ,వర్ణన మున్నగునవి రసరమ్యముగా మాకందించి నందులకు కృతజ్ఞతలు .
అవధాన సరస్వతులకు అభినందనలు

A.Satyanarayana Reddy చెప్పారు...

అష్టావధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్గెద్త్తిదలు చంద్రశేఖర రెడ్డి గారికి, అవధాని ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారికి, వివరములు మాకందించిన గురువర్యులు చింతా రామకృషారావు గారికి ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.