గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మే 2024, మంగళవారం

బ్రహ్మశ్రీ దేవీదాస రావుగారిచే ముద్రింపబడిన నా శ్రీమన్నారాయణ శతకము.

జైశ్రీరామ్.

 ఆర్యులారా! మీరు ఆనందించే వార్త. ఎంతకాలంక్రింద వ్రాసినదో నా శ్రీమన్నారాయణ ద్విత్వనకార ప్రాస శతకమును బ్రహ్మశ్రీ దేవీదాస్ రావుగారు ముద్రింపించి మా యింటికి పంపించారు.

👇🏼

బ్రహ్మశ్రీ దేవీదాసరావుగారికి ధన్యవాదములు.

విషయ సూచిక.

పండితాభిప్రాయములు.

నా మదిలోని మాట.

శ్రీమన్నారాయణ శతకము

అంకితము.

అక్షరక్రమములో పద్యముల వివరణ.

నేను, నా రచనలు.

పండితాభిప్రాయములు.

మనోజ్ఞం.

అవధాన భారతిసాహితీ చతురానన, ఛందో వైవిధ్య నిష్ణాత, స్వర్ణకంకణ, కవిగండపెండేర పురస్కారపు గ్రహీత, విద్వాన్ చక్రాల లక్ష్మీకాంత రాజారావుఎం..            

     చిత్ర కవిత్వ విశారదులు, నానావిధ ఛందః ప్రయోగ నిష్ణాతులు, సంస్కృతాంధ్ర ప్ండితులు, రస హృదయులు, సహృదయులునగు శ్రీమాన్ చింతా రామకృష్ణారావు గారు నాకు ఆత్మీయ సాహితీ మిత్రులు. వారి మైత్రీ బంధము మత్ పూర్వ పుణ్య ఫలం.

     వీ రెంత విజ్ఞాన సంపన్నులో అంత వినయ సంపన్నులు. వీరి పిలుపులో ఆత్మీయతా బంధం, చెప్పరాని మరో బంధం యిమిడి ఉంటుంది. వీరి ప్రతీ కావ్యం ఏదో వినూత్న విచిత్ర విశేష కావ్య వస్తు బాంధవ్యం కలిగి ఉంటుంది.

     వీరు రచించిన శ్రీమన్నారాయణ శతకం చదివితిని. ద్విత్వ నకార ప్రాసతో అష్టోత్తర శత పద్యములు, అందు ప్రతీ పద్యం ఏదో ఒక విశేషాంశం మనకు అందిస్తుంది. నవ విధ భక్తివిశేషాలు, హరి విశేష లీలలు, ప్రస్తుత సామాజికాంశములు, పంచభూతముల శక్తి తత్త్వము, భగవంతునికి భక్తునికి మధ్య గల అనురాగ భావన, దైవార్చనలు, నామస్మరణము చేయుట వలన కలుగు పుణ్య విశేషాలు,యిలా ఎన్నింటినో వీరు దృష్టాంత పూర్వకముగా వివరించారు.

     నేడు వ్రాయుచున్న శతకములలో వీరిదొక ప్రత్యేకమైన రచన. ఇలాగా వ్రాయవచ్చా? అను శంకకు వీరు తీసుకున్న మకుటమే నిదర్శనము. శ్రీమన్నారాయణ అను మకుటం తృతీయ పాదాంతమున అక్షరముంచి చతుర్థ పాదాదిగా వ్రాసి, శతకవాంగ్మయమున ఒక వినూత్న మార్గమును కవు;లకు అందించారు. పద్య కవులకు ఇది ఒక ఉదాహరణ కావ్యం కాగలదు.

79. శా. పెన్నాగంబును బాన్పుగాఁ గొనితివా? పెన్నీటిపై వాసమా?                                               అనే పద్యము చూడగనే నాకు కలిగిన అభిప్రాయము.                                                                    తే.గీహృద్యభావార్థ సంబద్ధ పద్యమిద్ది  -  భక్తితాత్పర్య సంయుక్త పద్యమిద్ది           పద్మనేత్రకృపాపాత్ర పద్యమిద్ది  -  భవమునందంగ దిక్సూచి పద్యమిద్ది.                             

శాచింతావారి మనోభిరామమగు సచ్చిద్బావమందాకినీ                           ప్రాంతోద్యానవనాంతసీమ రమణీయాకార పుంస్కోకిలా         స్వాంతోద్భూతమనోజ్ఞగీతవిలసత్పద్యస్వరాభిజ్ఞత     న్సంతోషాత్మఁబఠించితిన్ముకుళితస్వాంతాన వందించితిన్.

పాఠకులైన మనమందరం వీరి శతకమును చదివి, శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులమగుదుము గాక,. వీరి నుండి మరిన్ని కావ్యములు వచ్చునట్లు ధీశక్తిని, ఆరోగ్య సంపదను, ఆయుస్సౌభాగ్యమును హరి అందించును గాక.              

ఇట్లు బుధజన విధేయుఁడు

చక్రాల లక్ష్మీకాంత రాజారావు.    విశ్రాంత సంస్కృతోపన్యాసకులు

హైదరాబాదు.   తే.23 – 9 – 2022                                                                                                                                                                                                                                                                              

శ్రీమన్నారాయణ పద్యకవచము. 

                       శ్రీ ఆముదాల మురళి.     శతావధాని ..  తిరుపతి.                              

.      కవన కళ పురాకృత పుణ్యవిశేషము. జీవుని అంతరంగ బహిరంగ సంస్కార ముల సంఘర్షణల. సమాలోచనల అక్షరాకృతి సామాజికమో, వైయక్తికమో, ఏదో ఒక ఆలోచన అంకురించి, అనేకానేక తర్జన భర్జనల అనంతరం ఒకప్రాగ్రూపాన్ని సంతరించుకొని, పరా పశ్యంతి  మధ్యమా వైఖరి యను అవస్థా భేదములతో అభివ్యక్తమవుతుంది. అదే ఆలోచన పాఠకునికి  లేదా శ్రోతకు వైఖరీ రూపంలో అంది, మధ్యమగా మారి, పశ్యంతిగా పరివర్తన చెంది, పరా రూప శబ్దబ్రహ్మానంద రూపాన్ని అనుభూతింప చేస్తుంది. కావుననే కవిత్వ నిర్మాణము తద్వ్యాప్తి అత్యంతావశ్యకములు. అందునా ఆస్తిక సామగ్రి కల కవిత్వం హృదయమార్దవం కావటం అహంకృతి నిరాకృతి కృతి వ్యక్తిత్వ శోభను యినుమడింప చేస్తుంది.

    శ్రీ చింతా రామకృష్ణారావు గారు చతుర్విధ కవిత్వ నిర్మాణ  చణులు. అవధానకళా పారీణులు, నిరంతర భగవచ్చింతనా పరులు, వారి వైఖరి పరానుసంధానమై ప్రత్యూష పవనాంకురములతో పాటు  పలికరిస్తుంది. కరుణాంఋతాన్ని చిలుకరిస్తుంది. ఏకదిన శతక రచనా నైపుణ్యం గల వీరు వేగాతివేగోక్తి లోను, నులుకడలోనురస బంధుర కవిత్వం చెప్పగలరు. వీరి అనేకానేక కృతులలో అనేక విలక్షణతలు అనేకంగా ఉంటాయి. ఈ అనేకత్వం వెనుకనున్న ఏకత్వం వారి అద్వైత స్థితి.

   నల్లేరుపైబండి నడకలా పద్యాన్ని నడిపించగల చింతా వారికి శతక రచన చిటికెలో పనిఐతే వీరి వైఖరీ వాక్కు పాఠకులలో శబ్దబ్రహ్మానందాన్ని కలిగించడానికి కావలసిన పద పదార్థ సామగ్రిని ప్రోగు చేసి, రస ప్లావితం గావించడం ఈ శతక ప్రత్యేకత. సాధారణంగా మకుటం పాదాంతంలో ఉటుంది కాని, నవనవోన్మేష సుధాధారాపాత ధీమంతులు యోచన అపూర్వముగా ఉండుట సహజమే కదాఽందుకే వీరు శ్రీమన్నారాయణ అన్న మకుటాన్ని చతుర్థ పాదంలో ద్విత్వ నకార ప్రాస కనుగుణంగా ఉపనిబద్ధం గావించారు. తత్ కారణంగా శతకం ఏకప్రాస ఘటితమైనది. సర్వ శార్దూల పద్య సమాశ్రితమైన యీ శతకం శత్రు షట్క శార్దూలములకు శరభంఋగమై భసిల్లుచున్నది. పద్యం పది కాలాలపాటు నిలవాలన్నా పది నాల్కలపై నడయాడాలన్నా హృదయంగమ శైలీ విన్యాసం అవసరం.   ఆశైలిని పుణికి పుచ్చుకొన్న అవధానశేఖరులు, చిత్రకవితా సమ్రాట్టులు చింతావారు. దీనికి శతకమే తార్కాణ్ము. రసవదలంకార శయ్యా సౌభాగ్య పరిపుష్టమై, పద్యమునందు దైవ భక్తి జోడించి, ప్రతీ పద్యం ఒక ప్రార్థనాపద్యం అయ్యేటట్లు మలచి తాత్పర్య సహితంగా ప్రకటింపఁ బూనడం వారి సౌహార్ద భావమునకు నిదర్శనం. ఇందలి పద్యరాజములు కొన్ని పురాణ గాథల సంబంధమై, మరికొన్ని ఉపనిషన్మంత్ర వ్యాఖ్యానములై, ఇంకొన్ని అపూర్వ భావనా విశేష భాజనములై, ఆర్తి, నివేదన, పశ్చాత్తాపాది సమున్నత గుణ శోభితములై అలరారుచున్నవి. భగవంతుఁడు సర్వ జీవులయందు సముఁడై యున్నాడని, వారి క్షుత్పిపాసాదులు తీర్చునని, భిన్నుండై తపించు హాలికులకున్ గేలిచ్చి కాపాడునని, అస్తి నాస్తి విచికిత్స తొలగించునని, సూర్య, చంద్ర వాయువులు శ్రీమన్నారాయణుఁడే నని, అతడు సంపూర్ణుఁడని, అదే సర్వ వేద తత్త్వమని సోహం అంటే చాలునని, దానికి దాసోహమ్మను భావన అవసరమని, కన్నులకున్న శక్తి క్షీణించు లోపల జ్ఞాన నేత్రం తెరుచుకోవాలనీ, కాలత్రయమునందు హరి నామ స్మరణే ధ్యేయమని, తెలియఁజెప్పెడి పద్యములు భక్తులపాలిట ఉపాధేయములు.

    భక్తుఁడు కవి అయితే రామచరిత మానసమవుతుంది. కవి భక్తుఁడయితే శ్రీమద్రామాయణమౌతుంది. రెండు ప్రయోజనాలూ సమున్నతాలే. కవిత్వము భక్తి సమతా స్థితిలో సాగే ఈ శతకంలో చింతావారు కొన్నిచోట్ల వాల్మీకిలా, చాలా చోట్ల తులసీదాసులా కనిపిస్తారు. పద్య రచనకిది పెద్దబాల శిక్షవంటి రచన.

    ద్విత్వ నకార ప్రాసాక్షరాలన్నీగుదిగూర్చినట్లు ఒకే చోట దొరకటం ప్రారంభకులకు వరం. అంతే కాదు చాల సంబోధనలు సాభిప్రాయములై ఔచిత్యంతో ఉండేటట్లు, చర్విత చర్వణములు గాక, గణపూరణలు గాక, యతిప్రాసానుకూలములై, పంటికింద రాయివలెనుండక, పాయసమునందలి జీడిపప్పువలె కలిసిపోయినవి. రూఢికి రూఢి, లక్షణకు లక్షణ, వ్యంజనకు వ్యంజన, అలంకారమునకు అలంకారము, వక్రతకు వక్రత, ధ్వనికి ధ్వని, ఇలా సర్వ లక్షణ లక్షణోపేతమైన ఈ శతకరాజము పాఠకులకు అభీష్ట సిద్ధిదాయిని యగుట అతిశయోక్తి కాదు. పఠన పాఠన విధికి మనన నిధిధ్యాసలకు, యీ పద్యములు ఆలంబనములై వర్తిల్లగలవు.

    ఈ నాలుగు మాటలు ముంజేతి కంకణమునకు అద్దము వంటివే. పాఠకులు హాయిగా లోనికి ప్రవేశించవచ్చు. ఆస్తికిలై అభ్యుదయ పరంపర సాధకులై, ముముక్షువులై శ్రీమన్నారాయణ చరణ సరోజ భ్రమరాయమాన ద్విరేఫంబులై, విజ్ఞాన సంపన్నులై, సామీప్య సాలోక్య సారూప్య సాయుజ్యాది క్రమ ముక్తి నొందెదరు గాక.

అనేక నమస్కారములతో

ఆముదాలమురళి. 

తిరుపతి. తే.20 – 9 – 2022.                                                                                                                                                                                                                                               

నా మనసునాకట్టుకొన్న శ్రీ మన్నారాయణ శతకం

బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రి గారి స్పందన.

ప్రథమంగా.....శ్రీ చింతా రామకృష్ణారావు గారికి నమస్కృతులు . ఎందుకంటే ....కవీశ్వరులనీ......

మాకు తెలిసిన గొప్పవారిలో ఒకరనీ కాదు

.     ఈ పుస్తకం చదువుతుంటే మాఊరి గుడిలో మా భావనారాయణ స్వామిని రామకృష్ణారావు గారి పద్యాలతో

ప్రార్థిస్తున్నట్లున్నది. మాదిపొన్నూరు .అక్కడ ప్రసిద్ధ దైవము శ్రీ భావ నారాయణ స్వామియే.

రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి విగ్రహం గుడికి ఎదురుగా ఉంటుంది. నాయుడు గారు ఆగుడికి చాలా మాన్యాలు  ఇచ్చారుట.

     శతకం చదవటం మొదలుపెట్టాను. మొదటి పద్యం శ్రీ న్నీ వక్షమునందు నిల్పి

చదువుతుంటే  క్రింది భావాలు కలిగినయ్యి .

"హరిహరి సిరియురమున గల హరి" అని వామనావిర్భావమునకు ముందే యురమున సిరి

ఉంటుందని భాగవతంలో చెప్పారు. అయితే, స్థానము నిరూపించబడినది

వామనావతారంలో.కపటవామనుడే స్వయముగా , "సిరి యుతొల్లి గలదు" అని చెబుతాడు. .

దానము ఇవ్వబోయే .ముందు బలి "సత్యహీనుని మోవజాలననుచు బలుకదే తొల్లి భూదేవి"

అంటాడు, సత్యపదవీ ప్రమాణతత్పరుండు.ఇక వటుడింతంతై సత్యలోకం ను దాటిన తరువాత

లోకాలు యేయే స్థానంలో ఉన్నవో చెబుతూ "మనంబున చంద్రుండును వక్షంబున కమల హస్త

యగు లక్ష్మి యు " అంటాడు భాగవతకారుడు. వామన రూపంలో గాని విశ్వరూపం లో గాని లక్ష్మి స్థానం వక్ష స్థలం.  ఇక "సత్య సన్నుతగుణా అన్న "సత్య" పదం బలిచక్రవర్తిని ఉద్దేశంచినదే. సత్యం కోసం తెలిసి...ఆయన. త్రైలోక రాజ్యం వదులుకున్నాడు.శతకం వామనావతారసూచనతో మొదలు కావటం శుభవిజయ సూచకం.    శ్రీ తో ఆరంభంఎటూ ఉండనేఉంది}. ఇక గ్రంథం లోకి వెళితే కొన్ని పద్యాలు స్థాలీ పులాక న్యాయంగా చూద్దాము. నాకు అన్ని గొప్ప పద్యాలలో బాగా ఆకట్టుకున్న పద్యం ఇది

నిన్నున్ జూచెద పక్షులన్  బశువులన్ దృగ్గోచరంబౌదునీ

వెన్నింటన్గలవన్నిటన్ గనియెదన్ సృష్టిం వివేకంబుతోన్

భిన్నంబంతయు గానరాదనియు నీవేగా దయాపూర్ణశ్రీ

మన్నారాయణ నీవు లేని యెడలన్ మాకెట్లు కానంబడున్ …31.

      సర్వ జగత్తులో అన్నిటియందును  శ్రీ మన్నారాయణునే చూడాలి. ఇదే ప్రహ్లాదుడు భాగవతం లోచెప్పింది‌."ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు….

 34. విన్నంజాలును నీమహాద్భుత కథల్ ...

సరిగ్గా ప్రాణావసాన సందర్భమున ఇదే కోరాడు పరీక్షన్మహారాజు కూడా . వారం రోజులలో భగవంతుడిని గూర్చి తెలుసుకోవాలనుకున్నాడు 

36 పన్నీటన్ జలకంబులాడెదవు నీ భక్తాళిచే నిత్యమున్

కన్నీరింతయు  కారనీయని మతిన్ కారుణ్యమే చూపవా?

ఇక్కడ రామకృష్ణారావు గారు దేవుడిని దాదాపు నిలదీశారు

ఏమయ్యా మా పన్నీటిలో జలకమాడి  మా కన్నీటిని తుడవవా ...అని నిర్మొహమాటంగా అడిగారు. ఇదినిందాస్తుతి. తిట్టినట్లు కనబడుతుంది కానీ పొగడ్త అవుతుంది‌. ఇది భక్తి కావ్య లక్షణాలలో ఒకటి

38. జన్నంబుల్ పచరించి సాధకుడు నీ సామీప్యమున్ జెంది....

ఇదిఒకరకంగా దేవుడి యొక్క జగత్కారణత్వానికి  ఒకపరీక్షయజ్ఞంచేస్తేనే భక్తపాలనయా ..లేకపోతే లేదా ..జన్మ నిచ్చిన వాడికి జంతువుల పాలనా బాధ్యత లేదా?జన్మనిచ్చాడనటానికి ప్రమాణం బ్రహ్మ సూత్రాలు " జన్మాత్ యస్య యతః " అని ఘోషిస్తున్నయ్యే .నారుపోసినవాడు నీరుపోయటం ప్రకృతిలోన్యాయం . ఇది బాధ్యత గుర్తుచేయటం 

39 ( 38 పద్యానికి కొనసాగింపు ఈపద్యం)

లోకంలో దరిద్రుడు అన్నమో రామచంద్రా అంటూ అర్థిస్తాడు . ధనవంతులు ఆ అన్నాన్ని పారబోస్తారు  " భగవంతుడా నీ అన్నం అందరికీ లభించాలీ అంటూ రామకృష్ణారావు గారి లాంటివారు భగవంతుని ప్రార్థిస్తారు. ఇది మనిషి తాను సుఖంగా ఉండి సామాజిక బాధ్యతను పెంచమని ధ్వని( పుస్తకం కమ్యూనిస్టు ల కంట బడకుండా ఉంటే మంచిది. కనపడితే మాకు ఇంకొక కవిదొరికాడనిచంకలుగుద్దుకుంటారు )

40 ఉన్నావన్నిట గానరావు హృదిలో నున్నట్టి నీ రూపమున్ "

విచిత్రం ....అన్ని చోట్ల దేముడున్నాడుట కానీఎవరికీ కనబడట. దేవుడు అందరి కంటే మాయగాడు. మనవాళ్లు చూపించేది ఇంద్ర జాల విద్య . నిజానికది విద్యయే   నిజం కాదు దేవుడు చేసేదే నిజమైన యింద్రజాలం.

41 శూన్యమే పూర్ణమునకు కారణం

ప్రపంచంలో అన్నీ సాద్య వస్తువులే. ఆకాశం ఒకటే సిధ్దవస్తువు‌...జగత్కారణాన్ని ఆకాశవత్ సర్వగతఃనిత్యః " అని సూత్రం.  ఆకాశం సృష్టి చేయబడలేదు. " ఆత్మనః ఆకాశః సంభూతః " అని అన్నారు కానీ ఆత్మగోచరం కాదు . ఆకాశమే మన మనసుకి తెలిసే శూన్యం.

42 రామకృష్ణారావు గారు వాస్తవ దృక్పథాన్ని కలిగిన అతీంద్రయ దృష్టి కలిగిన కవులు.

హాలికున్ గనుమ....'అని రైతును గూర్చి ప్రార్థంచారు.పాత మహాకవులెవరూ (ఒక్కపోతన మినహా) రైతును గూర్చి పట్టించుకున్నవారెవరూ లేరు. రాయల వారిదగ్గరనుంచి వారి ప్రభువుల వరకు అందరూ రైతుపండించిన పంట తినేచరిత్ర సృష్టించారు. చరిత్ర కుఅన్నమే ఆధారం. దానికి రైతేమూలం. ఈవిధంగా చూస్తే చాలా మంచి పద్యాలు ఉన్నయ్

 50 పద్యంలో

నిన్నే సూర్యుని గా తలంచితిని పో ...

ప్రాణాన్ని మనం ఎందుకు పూజించాలో ఇందులో తెలిపారు సూర్యుడు రాత్రి ఉండడు

చంద్రుడు పగలుఉండడు.కానీ వాయివు పగలూ రాత్రీ భేదం లేకుండా ఉంటాడు. వాయువు ( ప్రాణ) దేవత అన్నది వేద ప్రామాణికం వాయుర్వై క్షేపిష్ఠాదేవతా "

 58 పద్యంలో

భక్తుడి యొక్క దీనావస్థ చెప్పాడుపన్నీటితో స్నానం చేయిస్తే కన్నీరు మిగిలిస్తాడుట దేముడు

భగవంతుడు కష్టాలు కలిగించడు అని నమ్మకంగా భక్తుడు చెప్పడు ఇక్కడ. శబ్దసౌందర్యం అర్థ సౌందర్యం సమానం గా ఉన్నయ్

ఇక 108 పద్యం లో రామకృష్ణారావు గారు తమ ప్రచ్చన్న వీడి ప్రత్యక్షంగా తమ వివరణకు

చెప్పుకున్నారు. సన్యాసి రాజు గారు రత్నాంబ గారుతల్లి దండ్రులను పూజించి శతకం రాశాను అనిచెప్పారు   స్వ గోత్రనామాదులను చెప్పుకోవటం ఒక ప్రయోజనం అయితే చదువరులకుభారతీయసంప్రదాయాన్నిఆచరించి చూపటం ముఖ్య ప్రయోజనం. .పాశ్చాత్య రచయితలు ముందుమాటలలోఎంతమంది తల్లిదండ్రులకు నమస్కరిస్తారో తెలియదు వాళ్ల చరిత్ర వారితోమొదలయి వారితోనేముగుస్తుందేమో తెలియదు.పుస్తకం పూర్తి సౌందర్యం అనుభవించాలంటే పూర్తిగా చదవాలిసిందే‌.

     పిల్లల పాఠ్య పుస్తకాలలో ఇందులో కొన్ని పెడితే బాగుంటుందేమో ఎందుకంటే శతకాలు కూడా అధునిక కాలంవస్తున్నయ్యన్న సత్యం పిల్లలకు తెలియాలి.

     పుస్తకం చదవటానికి ఇచ్చిన  శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలు  శ్రీ మన్నారాయణుడుసంపూర్ణానుగ్రహం చూపి రామకృష్ణారావుగారిని కటాక్షించు గాక అని మనందరంప్రార్థిద్దాము

శ్రీమన్నారాయణునకు నమస్కరిస్తూ

సి పిశాస్త్రి

బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రిగారు 

నేను రచించిన శ్రీమన్నారాయణశతకముపై తమ అమూల్యమైన అభిప్రాయమును పంపియున్నారు.

వారికి ధన్యవాదములు తెలుపుతూ

ఇక్కడ అందరికీ పఠన యోగ్యంగా ఉంచుచుంటిని.

జైశ్రీమన్నారాయణ.

ఇక పఠింపఁగలరు.

 

మధుపర్కం 

రసిక లోక పూజ్యులు , సాహితీ బంధువులకు మాన్యులు  శ్రీ చింతా  రామ కృష రావు కవి  గారు  నారాయణుఁని సంబోధిస్తూశ్రీ మన్నారాయణ శతకం" వ్రాశారు . శతకమంతా శార్దూలాలే . చాలా రాజసం గా  తిరుగుతూఉంటయ్యి సాహితీ "చింతా "వనం లో

" శ్రీ మన్నారాయణ" అనేది సంస్కృతం లో   సంబోధనా ప్రథమా విభక్తిఅంటే భక్తుడు నారాయణుని దర్శించుకుని సమక్షంలో చూస్తూ పిలవటం ...... .  దేముడిని అంత  దగ్గరగా చూడటంసాధ్యమా !

ఎందుకు కాదు . "అంతర్బ హి శ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః " అని ఒక పక్కన ఋషులు వారి అపరోక్షాను భూతిని చెబుతుంటే....  లోపల హృదయానికి చాలా దగ్గరగా పిలిస్తే పలికేంత దూరం లోనే ఉన్నాడు నారాయణుడు . అందుకే రామకృష్ణ రావు గారు అంతర్ముఖులై శతకం వ్రాశా రు

అదే శ్రీ మన్నారాయణ అనే  సంబోధన

 

ఇక  ఛందస్సు మాటకొస్తే .. పరిపక్వమైన అంతరంగాలకి ......  ఎందుకో తెలియదు ...  శార్దూలం స్పురిస్తుందా అనిపిస్తుంది.ప్రాచీన ఋషుల దగ్గరనుంచి ఎలకూచి బాల సరస్వతి దాకా .. 

సంధ్యా  వందనం లో"ముక్తావిద్రుమ హేమనీల ధవలై ..". నుంచి

 

 కాళి దాసు శ్లోక చతుష్టయం 

యాస్యత్యద్య శకుంతలేతి .హృదయం ..." మీదుగా 

 

ఎలకూచి బాలసరస్వతి {అజంత పరిచ్చేదంలొ 

 

" కర్ణాంతాయత చారునేత్ర కమలా !కర్పూర చూర్ణ త్రిపా 

ద్వర్ణ శ్రీ కర మంత్ర రూపిత విభాస్వద్రూప !చిద్రూప!సౌ 

 వర్ణోదంచిత మంచబిందుమయ దీవ్యద్దివ్య సింహాసనాం 

తర్ని ష్పం   విహార !హార కలికోద్యత్కాంచికా భూషణా 

 

ఇక రామకృష్ణ రావు గారి పద్యాలూ చూస్తే 

మొదటి పాదంలో పరిస్థితి వర్ణన/తీర్మానం  ,రెండోపాదం లో   కష్టం లేక అనుమానం .. మూడో పాదంలో  దాని పుష్టి లేక పరాకాష్ఠ  నాలుగో పాదంలో సమస్యా మోక్షణం ... అటు ఇటుగా విషయం  గా సాగుతుంది రావు గారి శతకం . ఇంకా ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు . దీనికి కారణం ఛందస్సు గంభీర భావానికి బాగా సరిపోవటమా లేక శార్దూలం పేరులో ఉన్న గాంభీర్యమా...  ఏమో ... మనమెంతటి వా రం తేల్చటానికి

ఇక కావ్య  గానం ... 

మాట ఎవరు మొదలుపెట్టారో గాని ప్రాచీన కాలం నుంచి మన కవులకు ఉన్న మంచి/చెడ్డ పేరు ఇది. ద్రావిడ కవులు వచనం కూడా పాట  గా చదువుతారని రాజశేఖరుడు చెబుతాడు

గద్యే ద్యే అథవా మిశ్రే కావ్యే కావ్య మనా అపి 

గేయే గర్భే స్థితః పాఠే సర్వో అపి ద్రావి డః కవిః

   

ద్రావిడ దేశీయుడగు కవి ప్రతి యొక్కడును కావ్య జ్ఞాన వంతుడై  గద్య కావ్యమైనను పద్య కావ్యమైనను చంపు కావ్యమైనను సంగీత గర్భముగా పఠించును . (సప్తమోధ్యాయము కావ్య మీమాంస )



శార్దూలం ఛందస్సు అందుకో గానే పాడాలని అనిపిస్తుందేమో 



ఇక పురాణ వాచస్పతి శ్రీ బంకుపల్లె మల్లయ్య సాస్ట్రీ గారైతే సామవేద దండాన్వయ ఉపోద్ఘాతం లో "గానమునాకింత ప్రాధాన్యము ఇవ్వవలెనా  అంటే.. ఇవ్వవలెను ,.తపస్సు వలన గాని సమాధి వలన గాని గానము చేత లిగిన భావోద్రేకము కలుగదు. భావోద్రేకమే భగవంతుని కనుంగొనుటకు సాధనము. "

 వారే ఇంకొక చోట " సమస్త వేదమంత్రములును గాన  రూపమున సంధానమొనర్చ  వీలగునేమో ముందు రానున్న మహర్షులు యోజించ వచ్చును .. " అన్నారు

అందుకేనేమో .. పద్యాలూ విన్న గాయకులు (నాతో  సహా) మేమంటే మేము అని ముందుకు వచ్చి పద్యాలు పాడుకోవటం మొదలయింది.



శతక గానమంతా భావోద్రేకం తో భగవంతుని కనుక్కునే ప్రయత్నమే కదా. కాలం దృష్ట్యా అధునాతనం కావచ్చు. కానీ భగవంతుడు నిత్య సత్యమే  కదా

పద్యాలకీ మంత్రాలకీ పెద్ద తేడాలేదు



పురాతన పద్యాలే మంత్రాలు 

అధునాతన పద్యాలుకూడమంత్రాలే.అంటే అధునాతన మంత్రాలు

రెండు ఛందస్సు రూపం లో వచ్చినవే

వేదానికి ఛందస్సు అనేపేరుంది

 ఇక పద్య శిల్పానికొస్తే .. 

మన్నారాయణ శబ్దమే శార్దూలాన్ని దూరాహ్వానం చేసింది. ద్విత్వ "" కార ప్రాస .   ద్విత్వ "" కార ప్రాస దుష్కర ప్రాస కాదు కానీ క్లిష్టానికి అక్లిష్టానికి మధ్యలో ఎక్కడో ఉంటుంది. కనుక నిఘంటువు లో ఉన్న ద్విత్వ కార ""గణా లన్నీ బొట్టుపెట్టించుకుని పిలిపించుకుని మరీ వస్తయ్ . ఇక్క డే కవి జాగ్రత్త పడ్డారు . మాత్రం కృత్రిమత్వం లేకుండా , ధారా శుద్ధి  లోపించకుండా .. తర్కం చెడకుండా , సహజం గా వాలిన తీగ యొక్క సౌందరాన్ని చూపించారు. దీనికి వారిని  అభినందించాలి

ఇక పేరుకి తకమైనా 108 పద్యాలుంటయ్యి .ఇది సంప్రదాయం. ఆలయాల్లో పూజ గాని , బహుసంఖ్యాక లింగ ప్రతిష్ఠ లు గాని

మన వైదికం లో 108 కి ప్రత్యేక స్థానం ఉంది

దాని అసలు అర్థం ఇప్పుడు       చెప్పుకోకపోతే అసలు చెప్పుకునే  అవకాశమే రాదు

వేదకాలంలో  త్రేతా యుగం లో..... పది సంఖ్యకే చాల గొప్ప ఉండి ఉంటుంది

అందుకే యజ్ఞాలు ఎక్కువ చేశా డు అని చెప్పటానికి "దశరథుడు " అన్నారు . యజ్ఞాన్ని వేదం రథం తో పోలుస్తుంది. ఎందుకంటే యజమానిని స్వర్గానికి తీసుకెళ్లే ప్రయాణ సదనం కనుక

ఇక ద్వాపర యుగానికి నగరాలూ ప్రజలు సంఖ్య పెరిగినట్టుంది. 100 ఎక్కవ సంఖ్య గా చెప్పటం మొదలైంది. అందుకే కౌరవులు 100 మంది అని రాశా డు. వ్యాసుడు. బహుశ ఎక్కువ అని చెప్పటానికి 100 అని చెప్పటం మొదలు పెట్టరేమో విధం గానే   "శత మనంతం భవతి " అనే ఆశీర్వచన మంత్రం వచ్చి ఉంటుందిరోజూ యజమాని అగ్నహోత్రం చేయాలి . అది ఉదయం సాయంత్రం . అంటే రోజుకి రెండు సార్లు. ఏదైనా కారణం తో అగ్నిహోత్రం చేయటం మానేస్తే 4 రోజుల తరువాత అగ్ని లౌకికాగ్ని అయిపోతుంది. దాహపాకా లకు మాత్రమే పనికొస్తుంది  అంటే ......మంటే.... అవుతుంది. అగ్నిభగవానుడు కాదు. మొత్తం నాలుగు రోజులలో 8 సార్లు అవుతుందిఅట్లా మానేసినప్పుడు అగ్నిని 100 తో పాటు ప్రాయశ్చిత్త సంఖ్యా అయిన 8 తో గూడా చేయాలి . అందుకని అగ్నికి 108 సంఖ్యా అంత  ప్రాధాన్యమయింది.కనుక శతం అన్న చోటల్లా నూట ఎనిమిది అని మనం  అను వదించు కోవాలి . కనుక మన వైదిక మతం లో 108 కి విధం గా ప్రాధాన్యం వచ్చింది . గుడికి వెళ్లే వారు సామాన్యంగా అగ్ని ఉపాసన చేసే వారుండరు. అందుకని దేముడిని శత నామాలతో పూజించవారు  అష్టోత్తర శతం చేయిస్థారు

కవిత్వం కూడా ఒక రకం గా అగ్ని ఉపాసనా కదా . దేముడు కూడా అగ్ని కదా

:'అహం వై శ్వానరో భూత్వా పచామ్యన్నాం చతుర్విధం" అని విష్ణువే చెప్పాడు.అందుకే దేముడికి సంబంధించినది ఏదైనా 108 సార్లు చేస్తారు. గాయత్రీ జపం తో సహా.  

చింత రామకృష్ణ రావు గారు చేసిన శతకం ఉభయ తారకం .. అంటేఆయనకు లోకానికి ఇద్దరికీ ఉపయోగంపరోపకారాన్ని మించిన పుణ్యం తీర్థము ఇవ్వదని కాశీఖండం లో వ్యాసుడు చెప్పాడు కదా  మధుపర్కం అంటే వరపూజలో అల్లుడికి ఇచ్చే పెరుగు  తేనె కలిపిన      పానీయం .. 

ఇట్లు.

అందుకూరి శాస్త్రి.

బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రిగారికి 

నా హృదయపూర్వక ధన్యవాదములు.

 

 

చిత్రగర్భకవితావతంశులు, గౌరవశ్రీ చింతారామకృష్ణారావు విరచిత

"శ్రీమన్నారాయణ శతకము"- పై.

బ్రహ్మశ్రీ  వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. … జుత్తాడ.

నూతన ఛందోగర్భ కవితాసుమపారిజాతము                                                                                            నర్తన, మనోరమ, సుభిక్ష, దదామీతి, వర్ఛశ్వినీ, సంస్తుత్య,హేతుభూత, చిదానంద

సమ్మోదినీ, ముక్తిహేతు గర్భ-"జన్మధన్య"-వృత్తము.

  "  జన్మధన్య-వృత్తము." ఉత్కృతిఛందము.........లగ.గణములు.

యతులు.10,18.ప్రాసనీమముగలదు.

*శ్రీమన్నారాయణ స్ఫురణం?చిదానంద!సమ్మోదమౌ!జీవన్ముక్తిహేతు!భూతమౌ

మా' మాధుర్యంబగు!మహిమం!మదార్తిం!దొలగించుగా!మావద్దివ్యసంస్తుతింజనున్!

రామామీదౌ! శతకమిలంరథారోహణంబౌ!,ఘనా!    ప్రావర్ఛశ్వులం వెలుంగిడున్!

దామంబౌదివ్యు!గళముం!దదామీతి"మోక్షంబనం?తావజ్జన్మ!ధన్యతం గనెన్!*

భావము:- శ్రీమన్నారాయణ స్ఫురణము మనస్సున కానంద మొసగును.

జీవన్ముక్తికి హేతుభూతమదియే. ఈశతకము, శ్రీమన్మహాలక్ష్మి మహిమచే

మాథుర్యము సంతరించుకొనును. నాయొక్క యనగా ఆత్మాకమైన (ఆత్మగల

ప్రతీజీవికి) కష్టములను తొలగించును కదా! లక్ష్మీప్రదమైన, మనోహరమైన

స్తుతితో నలరారును. రామా=శ్రీయుతులురామకృష్ణార్యా! మీచే రూపుదిద్డఁబడిన మీదైన

శ్రీమన్నారాయణ శతకము రసాతలమున క్రొత్తకాంతులతో వెలుగులిడును. జ్ఞానప్రబోధ యగును.

కంఠహారముగా సురలగళాకంఠవమై తనరును. మోక్షదాయినియైన!మీకృతివలన మీజన్మ ధన్యత నందెను.

1.గర్భగత"-నర్తనా"-వృత్తము. బృహతీఛందమమ...గణములు.వృ.సం.241.ప్రాసగలదు.

*శ్శ్రీమన్నారాయణ స్ఫురణం!  -  మా"-మాథుర్యంబగు మహిమన్!

రామా! మీదౌశతక.    మిలన్!  -  దామంబౌ! దివ్యు  గళమున్?*

2.గర్భగత"-మనోరమ"-వృత్తము. అనుష్టుప్ఛందము...లగ.గణములు.వృ.సం.74.ప్రాసగలదు.

*చిదానంద సమ్మోదమౌ?  -  మదార్తిం తొలంగించుగా!

రథారోహణంబౌ!ఘనా!  -  దదామీతి! మోక్షంబనన్?*

3.గర్భగత"-సుభిక్ష"-వృత్తము. బృహతీఛందము....గణములు.వృ.సం.169.ప్రాసగలదు.

*జీవన్ముక్తి హేతు భూతమౌ?  -  మావద్దివ్య!సంస్తుతిం జనున్?

ప్రావర్ఛశ్వులం!వెలుంగిడున్?  -  తావజ్జన్మ!ధన్యతం గనెన్?

4.గర్భగదదాదదామీతి"-వృత్తము. అత్యష్టీఛందము......లగ.గణములు.

యతి.10..యక్షరముప్రాసనీమముగలదు.

*శ్రీమన్నారాయణ స్ఫురణం?చిదానంద సమ్మోదమౌ?

మా"-మాథుర్యంబగుమహిమం!మదార్తిందొలంగించుగా!

రామా!మీదౌ శతక మిలం?రథారోహణంబౌ!ఘనా?

దామంబౌ దివ్యు గళముం?దదామీతి మోక్షంబనన్?*

5.గర్భగత"-వర్ఛశ్వినీ"-వృత్తము. అత్యష్టీఛందము......లగ.గణములు.

యతి.9..యక్షరముప్రాసనీమముగలదు.

*చిదానంద సమ్మోదమౌ?జీవన్ముక్తి హేతు భూతమౌ?

మదార్తిం దొలంగించుగా!మా"-వద్దివ్య సంస్తుతిం జనున్!

రథారోహణంబౌ!ఘనా!ప్రావర్ఛశ్వులం?వెలుంగిడున్!

దదామీతి"-మోక్షంబనం?తావజ్జన్మ!ధన్యతం  గనెన్!*

6.గర్భగత"-సంస్తుత్య"-వృత్తము. ఉత్కృతిఛందము.........లగ.గణములు.

యతులు.9.18.ప్రాసనీమముగలదు.

*చిదానంద సమ్మోదమౌ!జీవన్ముక్తి హేతుభూతమౌ!శ్రీమన్నారాయణ స్ఫురణం!

మదార్తిం దొలంగించుగా!మా"-వద్దివ్య సంస్తుతింజనుం?మా,మాథుర్యంబగు మహిమన్?

రథారోహణంబౌ!ఘనా!ప్రావర్చశ్వులంవెలుంగిడుం!రామా!మీదౌ శతకమిలన్!

దదామీతి!మోక్షంబనం?తావజ్జన్మ!ధన్యతంగనెం!దామంబౌ!దివ్యు గళమున్!*

7.గర్భగత"హేతుభూత"-వృత్తము.ధృతిఛందము.......గణములు.

యతి.10,.యక్షరము. ప్రాసనీమముగలదు.

*జీవన్ముక్తి! హేతుభూతమౌ? శ్రీమన్నారాయణ  స్ఫురణం?

మా"-వద్దివ్యసంస్తుతిం!జనుం?మా"-మాథుర్యంబగు!మహిమన్?

ప్రావర్ఛశ్వులం వెలుంగిడుం!రామా! మీదౌ ! 'శతక ' మిలన్?

తావజ్జన్మ! ధన్యతం గనెం? దామంబౌ! దివ్యు  గళమున్!*

8. గర్భగత"-చిదానంద"-వృత్తము. ఉత్కృతిఛందము.........లగ.గణములు.

యతులు.10,19. ప్రాసనీమముగలదు.

*జీవన్ముక్తి!హేతుభూతమౌ!శ్రీమన్నారాయణస్ఫురణం!చిదానంద!సమ్మోదమౌ

మా'-వద్దివ్య!సంస్తుతిం జనుం!మా'మాధుర్యంబగు!మహిమం!'దార్తిం! దొలంగించుగా?

ప్రావర్ఛశ్వులం!వెలుంగిడుగా!రామా!మీదౌ'శతక'మిలం?రథారోహణంబౌ! ఘనా!

తావజ్జన్మ!ధన్యతం గనెం?దామంబౌ దివ్యు గళముం?దదామీతి!మోక్షంబనన్*

9.గర్భగత"-సమ్మోదినీ"-వృత్తము. అత్యష్టీఛందము......లగ.గణములు.

యతి.9..యక్షరము. ప్రాసనీమముగలదు.

*చిదానంద!సమ్మోదమౌ!శ్రీమన్నారాయణ!స్ఫురణం?

'దార్తిం!దొలంగించుగా?మా"-మాథుర్యంబగు?మహిమన్!

రథారోహణంబౌ!ఘనా!రామామీదౌ!'శతక ' మిలన్?

దదామీతి మోక్షంబనం? దామంబౌ! దివ్యు గళమున్!*

10.గర్భగత"-ముక్తి హేతు"-వృత్తము.

ఉత్కృతిఛందము.........లగ.గణములు. యతులు.9.18.ప్రాసనీమముగలదు.

*చిదానంద!సమ్మోదశ్రశ్రీమన్నారాయణ!స్ఫురణం?జీవన్ముక్తిహేతుభూతమౌ?

'దార్తిం!దొలంగించుగా?మా"-మాథుర్యంబగు!మహిమం! మా"-వద్దివ్య సంస్తుతిం జనున్!

రథారోహణంబౌ!ఘనా!రామా!మీదౌ'శతక'మిలం?ప్రార్ఛశ్వులలం వెలుంగిడుగా!

దదామీతి మోక్షంబనం?దామంబౌ!దివ్యు గళముం!తావజ్జన్మ! ధన్యతం!గనెన్!*

     భక్తి ప్రబోధాత్మకమైన మీకృతి యాచంద్రతారార్క మీపుడమిని నిలుచుటయే కాక శ్రీమన్నారాయణుని

కరుణాకటాక్షములు లోకమునకుప్రసరించునుగాత!సమస్త సన్మంగళాని భవంతు!సర్వేజస్సుఖినోఃభవంతు!

ఇట్లు,

తమ విశ్వసనీయుడు.

వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి 

బ్రహ్మశ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావుగారు 

నాచే రచింపఁబడిన శ్రీమన్నారాయణశతకముపై వారి అభిప్రాయమునుగ్గడించియున్నారు. చూడఁగలరు.

జైశ్రీమన్నారాయణ.

శ్రీ మన్నారాయణ శతకమును గూర్చి ..... నా యాలోచన.  

సోదరులు చింతా రామకృష్ణారావు గారి మస్తిష్కమొక "అమృత భాండము". దాని నుండి నిరంతర
భక్తిరస ప్రపూర్ణామృత ధారలు కురియుచునే యుండును. వారి కవిలెల్లప్పుడును
"కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతర క్షతయే"అను ప్రయోజనములలో
"శివేతరక్షతయే"యను ప్రయోజనమునే కోరుచుండును. ఏలనన అది శాశ్వతమైనది,
మోక్షదాయిని కనుక. భక్తిభావ సమన్విత కవితాఝరి గంగానది వలె ఎల్లకాలము
ప్రవహించును. వీరి కవిత నిరుపమానము, నిస్స్వార్థము. ఉదా : శా : " నన్నున్
గావగ రమ్ము నీవనినచో నా స్వార్థమే యౌను. నీ......ఉన్నావందరి కోసమంచు కని,
దీనోద్ధారకా." యనుటలో  నన్ను మాత్రమే కాదు సమస్త ప్రాణికోటిని దయతో
గావుమనుటెంతో నిస్స్వార్థ భక్తి ప్రపత్తి. జీవిత పరమావధి మోక్షము.
పూర్వజన్మ కర్మ పరిపాకము కానిదే ముక్తి రాదను విషయమందరకు విదితమే. కర్మలు
నశించుటకు భక్తి యత్యంత ప్రభావవంతమైన సాధనము. దానిని తాను పొందియుండుటచే
నిత్య శ్రీమన్నారాయణ నామ స్మరణజేయు సంకల్పము కలిగినది. కనుకనే ధైర్యముగా
" శ్రీమన్నారాయణా!ప్రేమతో ముక్తి ప్రసాదింపుమా!"అంటారు కవిగారు ఎంతో
చొరవగా, ఆత్మీయముగా.    దేవా! నీవున్న న్ని నాళ్ళే నాయీ శరీర
సౌందర్యము. నీవు వెడలిన నాడిది దేవుడు లేని గుడే. కనుక నీవుండగనే నాకు నీ
కథలతో పంచేంద్రియ సుఖములనిమ్మని కోరుకుంటారు.                  ఉదా :
కన్నుల్, కాళ్ళును , జేతులున్.......ఇలా సూర్య తేజాన్ని అద్దంలో చూపించటం
అసాధ్యము. అన్నీ (108) సూర్యతేజాలే. ఉపాసనాబలంతో నే వానిని అర్థం
చేసికొనగలము.                         
" సూర్య తేజస్సు మీయందు శోభగూర్చి.,                    
భక్తి విశ్వాస శార్దూల వృత్తశతము.,                    
శతక కావ్యంపు మధురిమ సంతరించె.,         
రామకృష్ణ కవి వరేణ్య! రమ్య చరిత!".
   శుభం భూయాత్!!

సోదరుడు....పొన్నెకంటి సూర్యనారాయణ రావు. భాగ్యనగరము.  30.04.2018.

తమ అమూల్యమయిన అభిప్రాయమునందించిన శ్రీపొన్నెకంటి సూర్యనారాయణరావు సహోదరులకు ధన్యవాదములు.

 

నా మదిలోని మాట.

     ఆత్మస్వరూపులయిన పాఠకులకు సాధకులకు నమశ్శతములు.  ఆ శ్రీమన్నారాయణుని దయ ఎప్పుడు ఏ విధంగా ఎవరికి లభిస్తుందో చెప్పఁ జాలము.

     హైదరాబాదులొ శ్రీ చింతమనేని కృష్ణారావుగారిజయంతి సందర్భముగా ఏర్పాటు చేసిన సభకు వేదవతి అక్కయ్యగారి ఆహ్వానం మేరకు కీ.శే.జోళదరాశి చంద్రశేఖరరెడ్డిగారితో కలిసి వెళ్ళియుంటిని. అక్కడ సభలో ముఖ్య అతిథి వక్త అయిన శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారి ఉపాన్యాసము విని వారికి ఒక శార్దూల పద్యమును వ్రాసి పఠించితిని. అదివినిన అందరూ సంతసించినారు.

     ఆ రాత్రి నా మనసులో శ్రీమన్నారాయణుని తలపులే మెదలుచూ శ్రీమన్నారాయణ మకుటముతో పద్యము వ్రాసి ప్రాతః కాలముననే మిత్ర బంధు కోటికి వాట్సప్ ద్వారా పంపి యుంటిని. ఎందరెందరో ప్రశంసించుటతో ఉత్సాహము ఉరకలెత్తి రోజూ ప్రాతః కాలముననే ఒక పద్యము వ్రాసి పంపుచుండగా ద్విత్వనకార ప్రాసతో నూట ఎనిమిది పద్యములు ఆ శ్రీమన్నారాయణుని తలపులే వ్రాయించినవి. ప్రతీ రోజూ పాఠకుల ప్రశంసలే ఈ పద్యములు ప్రభవించుటకు మూలమయ్యెను. ఆ శ్రీమన్నారాయణుని ప్రేరణ పాఠకమహాశయులద్వారా నాకు లభించి నన్ను శ్రీమన్నారాయణ శతక కర్తగా చేసినవి. ముఖ్యముగా       డా.శ్రీ డీ.వీ.జీ.యే. సోమయాజులు గారు, శ్రీ డిల్లీస్ పండి గారు, ఇంకనూ మహనీయులు కొందరు నా పద్యములలో అనౌచిత్యములుగా అనిపించిన ప్రయోగములను సూచించుచు నాకు సహకరించుచు ఈ శతక రచనకు తమ ప్రోత్సాహము నందించెడివారు. పేరు పేరునా అందరికీ నా ధన్యవాదములు.బెంగుళూరు నివాసి శ్రీమతి దోర్భల బాలసుజాత నన్ను అన్నయ్యా అని ఎంతో ప్రేమగా పిలుచుచు శ్రీమన్నారాయణ శతక పద్యములు కొన్నాళ్ళు పాడి పంపుచుండగా పద్యముతో పాటు గానమును కూడా అందరికీ పంపెడివాడను. బంగారమునకు పరిమళము అబ్బినట్లున్నదని అందరి మెప్పును పొంద గలుగుట నా భాగ్యము. గాత్రము సరిగా లేక శ్రీమతి సుజాత సహోదరి పాడలేకపోవుచుండగా నాకు ఆ భగవంతుడిచ్చిన మామగారు బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రి గారు రోజూ పద్యములు పాడుచు పంపుటతో పాఠకులకు అందించి ప్రసంసింపబడెడివాడను. ఇట్లు ఎందరెందరో  పాడుచూ పంపుచుండెడివారు. ఈ విధముగా గాయకుల,   వేల సంఖ్యలో ప్రోత్సహించిన పాఠకులపేర్లు చెప్పనలవి కాదు. పేరు పేరునా ప్రత్యక్షముగా పరోక్షముగా నన్ను ప్రోత్సహించిన మహనీయులందరికీ ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహము లభింపవలెనని కోరుట తప్ప మరే విధముగనూ వారి ఋణము తీర్చుకొనఁ జాలను. అందరికీ నమస్సులు.

     బ్రహ్మశ్రీ బాబూ దేవీదాసురావుగారు శ్రీమన్నారాయణ శతక పద్యములు రోజూ పఠించి పరమానందముతో ఈ శతక ముద్రణా అవకాశము తనకు కలిగించమని ఎంతో సహృదయతతో అడిగిరి. ఆశ్రీమన్నారాయణుని ఆజ్ఞగా భావించి వారికి ఈ శతకమును కృతజ్ఞతా పూర్వకముగా ముద్రణార్థము అందఁ జేసితిని. వారు దీని ముద్రణ చేయించి భక్తజనాళికి శ్రీమన్నారాయణుని కృపామృత వితరణ గావించియుండిరి. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. పాఠకమహాశయులు శ్రీమన్నారాయణుని భక్తటి ఈ శతకమును తన్మయులై పఠించుతరి గుణములు తోచిన అవి శ్రీమన్నారాయణుని కృపాకటాక్షముగా భావించగలరనియు, దోషములు కనిపించిన అవి నా అజ్ఞానమున దొరలినవిగా భావించి మన్నించగలరని ఆశించుచున్నను.

     కోరినతోడనే ఈ శతకముపై తమ అమూల్యమయిన అభిప్రాయములను అందజేసిన పూజ్యులు శ్రా అందుకూరి చినపున్నయ్యశాస్త్రిమామగారికి, డా.చక్రాల లక్శ్హ్మీకాంత రాజారావు గారికి, శతావధాని శ్రీ ఆముదాల మురళి గారికి నా ధన్యవాదములు. నాకు చేదోడు వాదోడుగా ఉండి నిరంతరమూ నారచనలకు ప్రోత్సాహమందించుచున్న నాఅర్థాంగి చి..సౌ.విజయలక్ష్మిగారికి, నా కుటుంబ సభ్యులకు నా ఆశీస్సులు.ఈ శతకమును వ్రాయించి నాకోరిక మన్నించి స్వీకరించిన కృతిభర్త శ్రీమన్నారాయణుని సహస్ర పాదములకు సహస్రాధిక ప్రణామములు. జై శ్రీమన్నారాయణా..

ఇట్లు                                                                                                                                                 సద్విధేయుఁడు                                                                                                                                               చింతా రామకృష్ణారావు.

 

శ్రీమన్నారాయణ శతకము

.(అష్టోత్తర శత ద్విత్వ నకార ఏక ప్రాస శార్దూలావళి)

రచన. చింతా రామకృష్ణారావు.

1. శా. శ్రీన్నీవక్షమునందు నిల్పి, సుజన శ్రేయంబుఁ జేకూర్చు నీ     

వన్నన్ మాకుఁ బ్ర మోదమే. సుగుణ సౌహార్ద్రంబులన్ మాకు మే

మున్నన్నాళ్ళునుఁ దక్కఁ జేయుదువు,  దీనోద్ధారకా! దేవ! శ్రీ

మన్నారాయణ! సత్య సన్నుత గుణా! మద్భాగ్య సంవర్ధనా

భావము.

దీనోద్ధారకా! దేవాది దేవా! సత్యము కారణముగా సన్నుతింప బడెడి గుణములు కలవాడానా

భాగ్యమును ప్రవృద్ధి చేయువాఁడా! శ్రీమన్నారాయణా! మేమున్నన్నాళ్ళును సుగుణ

సౌహార్ద్రంబులను మాకు కలుగ చేతువని లక్ష్మీదేవిని నీ వక్షస్థలముపై నిలిపి, మంచివారికి

శ్రేయస్సును చేయించెడి నీవన్నచో మాకు చాలా యిష్టమే సుమా.

 

2. శా. నిన్నున్నే ధర నెంచఁగాఁ దగుదునా? నీరేజపత్రేక్షణా!

పున్నామాదులనుండి కాచెదవుగా, పూజ్యుండ! నన్నెంచుచున్.

మన్నింతున్ మది నిన్ను నేను. గనుమా మర్యాదనే నిల్పి, శ్రీ

మన్నారాయణ! కావుమీజగతిఁ బ్రేమన్ మీ రమాసాధ్వితోన్.

భావము.

శ్రీమన్నారాయణా! పద్మనేత్రుఁడా! భూమిపై నిన్ను నేను ఎంచుటకు సరిపోదునా?

పూజ్యుఁడా! నన్ను గుర్తించుచు పున్నామాది నరకముల నుండి మమ్ము కాపాడుదువు కదా. నిన్ను

గుర్తించి నేను గౌరవింతును. నామర్యాద నిలిపుచు, లోకమున ప్రేమతో కూడిన దైవ గాథలతో నన్ను

కాపాడుము.

 

3. శా. క్రన్నన్ గావఁగ వచ్చి ప్రోతు వనుచున్, గన్పింతువీవంచు నో

కన్నా! చిత్త కవాటమున్ దెఱచి, నిన్ గాంచంగ నేనుంటి, నా

కన్నుల్ కాయలు కాచుచుండె, నయినన్ గన్పింప రావేల? శ్రీ

మన్నారాయణ! గాంచ నేరనయితో మాన్యా! మదిన్ వెల్గు నిన్.

భావము.

శ్రీమన్నారాయణా! కన్నతండ్రీ! వేగమే కాపాడుటకు వచ్చి నన్ను కాపాడుదువనియు, నీవు నాకు

కనిపింతువనియు, నా హృదయ కవాటమును తెరచి యుంచితిని. నా కన్నులు కాయలు

కాచుచుండెను అయినప్పటికీ నీవు నాకు కనిపించగా రావేమి? నా హృదయముననే నీవు

ప్రకాశించుచున్నప్పటికీ నిన్ను చూచుట నే నెఱుఁగకుంటినా?

 

4. శా. అన్నా కేశవ! మాధవా! నృహరి! మోహాతీత! గోవింద! రా

మన్నా! కృష్ణుఁడ! వామనా! సకల ప్రేమాధార! విశ్వేశ! యే

మన్నన్ నీదు ప్రశస్తనామమగు. మోహాంధంబునే బాపు. శ్రీ

మన్నారాయణ! నీదు నామ మహిమన్ మమ్మున్ సుఖంబందనీ. 

భావము.

ఓ అన్నా. శ్రీమన్నారాయణా! కేశవా! మాధవా ! నరహరీ ! మోహాతీతుడా ! గోవిందుడా!

రామన్నా ! కృష్ణుడా! వామనా! సమస్తమైన ప్రేమాధారమైనవాడా! లోకేశా!

మేము ఏది పలికినప్పటికీ అది నీ యొక్క.పేరే యగును. మోహాంధకారమును

పోగొట్టును. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.

పోగొట్టెడివాడా. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.

 

5. శా. ఎన్నం జాలుదె? దేవ! నీదు పద సంస్పృశ్యంబు నా చిత్తమం

దెన్నెన్నో మహిమల్ కనం బరచునే! దృష్టాంతముల్ పెక్కులో

కన్నా! నా కనులారఁ జూచుటకు నేఁ గాంక్షించుదున్. నీవె శ్రీ

మన్నారాయణ! నీదు పాద వరపద్మమ్ముల్ కనం జేయుమా.

భావము.

దేవా! శ్రీమన్నారాయణా! నీ పాద స్పర్శను కనీసము నేను మనసున ఊహించుటకైనను

సరిపోదునా? కన్నతండ్రీ! ఎన్నెన్నో మహిమలను నీ పాదములు కనఁబరిచెననుటకు పెక్కు

ఉదాహరణలు కలవు. అట్టి నీ పాద పద్మములను నా కనులారా చూడవలెనని నేను కోరుకొందును.

నీవే నీ పాద పద్మములు నాకు చూచునట్లుగా చేయుము.

 

6. శా. నిన్నుం గాంచిరి ధీనిధుల్ జగమునన్ నిత్యాత్ముఁగా నేర్పుతోన్

గన్నుల్ వేయిగ, కాళ్ళు వేయి, శిరముల్ గాంచంగ వేయుండుటన్,

సున్నాయౌ పరి పూర్ణమందు నిను దాసుల్గాంచినారయ్య! శ్రీ

మన్నారాయణ! చూతునన్నిట నినున్ మన్నించి నిన్ గాంచనీ.  

భావము.

శ్రీమన్నారాయణా! ధీ నిధులు నిన్ను నిత్యాత్మునిగా లోకములో వేయి కన్నులుగ, పాదములు

వేయిగా వేయి శిరములుగా నీకు ఉండుట. శూన్యమయిన ఆకారములో పరిపూర్ణ స్వరూపుడుగా నీ

దాసులు నిన్ను నైపుణ్యముతో చూడఁగలిగిరి. నిన్ను నేను అన్నింటియందును చూతును. నన్ను

మన్నించి  నిన్ను చూడనిమ్ము.

 

7. శా. కన్నా మంటిని దిన్న నిన్ జనని వేగన్ నోరు చూపించుమో

యన్నా యంచును దిట్టినంతటనె మోహబ్రాంతులన్ బాపుచున్

నిన్నున్నట్టి జగమ్ము చూపితివిగా నీవేను కృష్ణుండ! శ్రీ

మన్నారాయణ! మేము కూడ కనలే మా చూపరావేలరా?

భావము.

శ్రీమన్నారాయణా! నేవు కృష్ణుఁడుగా ఉన్నప్పుడు నీ తల్లి నీవు మన్ను తింటివని ప్రేమను కూడా

విడిచిపెట్టి నిన్ను ఏదీ నీ నోరు చూపించు అని కోపగించి పలుకగా ఆమెలో ఉన్న

మోహభ్రాంతులను పోగొట్టుచు నీలో ఉన్న సమస్త విశ్వమును చూపితివికదా. మేము మాత్రము నీవు

ఆవిధముగా చూపినచో చూడలేమా యేమి. మై మాకు చూపుటకు నీవేలరాకుంటివి?

 

8. శా. మున్నే నిన్ను మనమ్మునన్ మననమున్ మున్నుంచి మన్నించు నీ

నన్నున్, నా నిను నెన్నునాన్నను ననూనా! మున్నె మన్నించు నో

కన్నా! రక్షకు డీవె కాదె. మనమున్ గాంచన్ మహోదార! శ్రీ

మన్నారాయణ! కావుమయ్య.  జగతిన్ మంచిన్ గృపన్ గావుమా. !

భావము.

పరిపూర్ణుఁడవైన శ్రీమన్నారాయణాఇతః పూర్వమే నిన్ను మనసులో ముందుగా నిలిపి

మన్నించు నీవాడినైన నన్ను, నాకు సంబంధించిన నిన్ను గుర్తించెడి నా యొక్క అన్నను

ముందుగానే మన్నించునటువంటి నీకన్నారక్షకులింకెవరు? మనసుపెట్టి చూచెడి మహోదారగుణ

సంపన్నుఁడా! కాపాడుము. లోకమున మంచిని కృపతో కాపాడుము..

 

9. శా. ఉన్నావీవు హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభన్,

బిన్నన్, నేఁ గనఁ జాలనయ్య నిను గోపీనాథ! యంతర్ముఖుం

డెన్నంజాలు నినున్, శుభాస్పదుఁడ! నీవే నాకు కన్పించు. శ్రీ

మన్నారాయణ పూజ్య పాద జలజా! మాం పాహి. సర్వేశ్వరా!

భావము.

శ్రీమన్నారాయణా! నీవు నా హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభతో కొలువై యున్నావు.

నేను  చిన్నవాడిని. నిన్ను విధముగనూ నిన్ను చూచుటకు సరిపోను. అంతర్ముఖుఁడైనావాడి

నిన్ను గుర్తించగలడు. శుభాస్పదుఁడా! నీవే నాకు కన్పించుము. పూజ్య పాదపద్మములు

కలవాడా! సర్వేశ్వరా! నన్ను రక్షించుము.

 

 10. శా. మిన్నున్ గాంచిన నీవె నిండితివటన్ మిధ్యా స్వరూపుండవై!

మన్నున్ గాంచిననుంటివీవె యచటన్  మాదేవరా! యెట్లు నీ

వున్నావన్నిట నెల్ల వేళలను ? నేనున్నా నిటన్, జూడు.  శ్రీ

మన్నారాయణ! నీదు పాదములె సమ్మాన్యుండ! నన్ జూడనీ.

భావము.

శ్రీమన్నారాయణా! జగత్కారకుడవైన శ్రీకృష్ణా! ఆకాశమును చూచినచో అక్కడ

మిధ్యాస్వరూపుఁడవై నీవే  నిండియున్నావు. భూమిని చూచినను అక్కడ కూడా నీవే నిండియున్నావు.

మా దైవమా! అన్ని సమయములందును అన్ని ప్రదేశములయందునుఏ విధముగా నీవుంటివి?

ఇక్కడ నేనుంటిని. నన్ను చూడుమునీ పాదద్వయమును నా మనమున గౌరవముతో గాంచునట్లు

చేయుము.

 

11. శా. పున్నెంబుండును బేదలన్ గనుమయా. పోషింపఁగా లేక తా

మన్నంబైనను బెట్టలేక సుతులన్ బాధించుచున్నారు. నీ

వున్నావన్నది సత్యమై ప్రబలఁగా నోదార్చి పోకార్పు. శ్రీ

మన్నారాయణ!బాధలన్ బ్రజలకున్, మాకీవ మూలంబుగా.

భావము.

శ్రీమన్నారాయణానీకు పొణ్యముండును.పేదవారిని చూడుము. తమ సంతానమును పోషింప

లేక కనీసము వారికి అన్నమైనను పెట్టలేక, ఆకలిబాధకు లోనగునట్లు చేయుచున్నారు.

నీవున్నావన్న విషయము సత్యమై వ్యాపించునట్లుగా అట్టి పేదలనోదార్చి, వారి పేదరికము

పోగొట్టుము. శ్రేష్టమైన మనసు కలవాడవయి వారి కష్టములను మాపివేయుము.

 

12. శా. పున్నెంబే కద పేద సాదలకుఁ బ్రాపుం గొల్ప నీవున్నచో.

మన్నింపంబడు దీవెగా? దయను రామా! కావు మమ్మంచు వా

రున్నం గానవు, నీకు నొప్పగునొ? కాదో పాపమిట్లున్న? శ్రీ

మన్నారాయణ! శ్రీరమా రమణ! ప్రేమం జూపుమా వారిపై

భావము.

శ్రీమన్నారాయణా! నీవున్నట్లైనచో పేదసాదలకు ఆధారము కల్పించితివేని అది నీకు పుణ్యమే

కదా. వారిచేత నీవేకదా గౌరవింపఁబడుదువు? రామా దయతో మమ్ము కాపాడుమయ్యా అనుచు

పేదలు నిన్ను ప్రార్థించుచున్నను నీవు చూడవుకదా. ఇది నీకు సముచితమగునాయేమి?

విధముగ చేసిన నీకు పాపమంటదా? రమారమణా! నీవు అట్టి వారిపై ప్రేమను చూపుము.

 

13. శా. కన్నుల్ కల్గఁగ జేసితీవె కనఁగాఁ గన్నార నిన్ గానఁగాన్.

గన్నా! నిన్ గనుఁగొన్న మన్ననయెగా? కన్పింప రావేల? కా

కున్నన్ సర్వ జగంబునన్ గనమనా, యుత్సాహమున్ నిన్ను, శ్రీ

మన్నారాయణ! కాంతుమన్నిట నినున్ మర్మంబు పోకార్చినన్!

భావము.

శ్రీమన్నారాయణా! ఆలోచింపగా కన్నులనిండుగా నిన్ను చూచుట కొఱకు నీవు మాకు కన్నులను

కల్గునట్లు చేసితివి. కన్నయ్యా! నిన్ను చూచినచో మాకు గౌరవమే కదా. అటువంటప్పుడు మాకు

కనిపించవేమి? విధము కానిపక్షమున సమస్త లోకమున ఉత్సాహముతో నిన్నే చూడమనా? మాలో

మాయను నీవు పోవునట్లు చేసితివేని అన్నింటి యందును నిన్నే మేము చూచెదము.

 

14. శా. కన్నుల్ సూచెడి శక్తి కల్గియును నిన్ గాంచంగ లేవేలనో?

మన్నైపోయెడి దేహమందు కల నిన్ మర్యాదగాఁ జూడలే

కున్నన్ గన్నులవేల మాకుఁ? గననీవో నిన్ను గుర్తించి? శ్రీ

మన్నారాయణ! దేహివౌచుఁ గల నిన్ మా కండ్లతోఁ జూడనీ.

భావము.

శ్రీమన్నారాయణా! కన్నులకు చూచెడి శక్తి యున్నప్పటికీ ఎందుచేతనో కాని నిన్ను

చూడలేకపోవుచున్నవి మన్నైపోయే శరీరమునగల నిన్ను గౌరవప్రదముగా చూడలేకపోయినచో

అట్టి కన్నులు మాకెందులకు? నిన్ను గుర్తించి చూడనీయవా యేమి? దేహధారివై మా రూపములో

నున్న నిన్ను కన్నులతో చూడనిమ్ము.

 

15. శా. కన్నారన్ నినుఁ గాంచ వేడుక, జగత్ కల్యాణ రూపుండ! నే

నున్నానంతట చూడు నన్ననుచు మా యూహల్ నిజంబంచు, మా

పున్నెంబై కనిపించుమొక్కపరి. మేమున్ నీకు కన్పింప శ్రీ

మన్నారాయణ! నీదు మంచి కననీ. మాపూజలందించనీ.

భావము.       

లోక కల్యాణ స్వరూపా! శ్రీమన్నారాయణా! మా కన్నులారా నిన్ను చూడవలెనని మాకు వేడుక.

నేను అంతటా ఉన్నాను అనుచూ మా ఊహలు నిజమే అనుచు ఒక్కపర్యాము మేమూ నీకు

కనిపించు విధముగా మా ముందు నిలిచి, మా పుణ్య ఫలమై కనిపించుము. నిన్ను మనసారా చూడనీ.

మా పూజలు నీకు మేమందించునట్లు అనుగ్రహింపుము.

 

16. శా. విన్నన్ నీ శుభ నామమే వినవలెన్ విభ్రాంతులం బాయఁగాఁ.

గన్నన్ నీ దర హాసమే కనవలెన్ గాంచంగ మోక్షంబు. లే

కున్నన్ జన్మము వ్యర్థమే కనఁగ దీనోద్ధారకా! దేవ! శ్రీ

మన్నారాయణ! ప్రేమతోడుత మమున్ మన్నించి రక్షింపుమా.

భావము.

దీనోద్ధారకా! శ్రీమన్నారాయణా! విన్నట్లైతే మాలో క్రమ్ముకొనిన భ్రాంతులు మాసిపోవువిధముగా నీ

నామమే వినవలెను కదా. చూచినట్లైతే మోక్షము పొందజేయు నీ చిఱునగవే కనవలెను. విధముగ

కానినాడు  జన్మము వ్యర్థమే సుమానీవే మమ్ములను చూచి, మన్నించి రక్షించుము.

 

17. శా. వన్నెల్  చిన్నెలు భ్రాంతి కారకములా భ్రాంతిన్ హృదిన్ గోర్కెలౌ

నెన్నన్ దద్గతి శత్రు షట్కమలమున్, దృష్టంబులౌ దుర్గతుల్.

కన్నుల్ మూలములింతకున్, గనుక నేఁ గాంక్షింతు జ్ఞానాక్షి. శ్రీ

మన్నారాయణ! జ్ఞాన నేత్రమగుచున్ మాయందు నీవుండుమా.          

భావము.

శ్రీమన్నారాయణా! జగత్తులోని వన్నెలు చిన్నెలు కేవలము మాలో భ్రాంతి పుట్టుటకు

మూలములు. అట్టి భ్రాంతి కారణముగా మాలో కోరికలు జనించును. విధముగా అరిషడ్వర్గము

మాలో అలముకొనును. ఆపై దుష్టమైన అధోగతులు  నిశ్చయము.. ఇన్నింటికీ కన్నులే మూలము

కనుక నేను నిన్ను జ్ఞాననేత్రమును మాకు ప్రసాదించుమని కోరుచుందును. నీవే జ్ఞాన నేత్రముగా

నీవే ఉండుము.

 

18. శా. విన్నన్ జాలును నీదు నామ మహిమల్, వీనుల్ శుభంబుల్ కనున్.

విన్నన్ లౌకిక దౌష్ట్యముల్ పతనమే వీనుల్ ప్రబోధించు, నో

యన్నా! నీ శుభ నామ దివ్య సుధ జ్ఞేయంబై వినం జేసి, శ్రీ

మన్నారాయణ ముక్తి దాతవయి, మా మర్యాదనే నిల్పుమా.

భావము.

శ్రీమన్నారాయణా!నీ నామ మహిమను విన్నంత మాత్రమున చెవులు శుభములు

పొందును.లౌకికమైన దౌష్ట్యములను చెవులు విన్నచో పతనమునే ప్రబోధించును. నీయొక్క

శుభప్రదమైన దివ్యమైన నామామృతమును జ్ఞేయమగుచు వినునట్లు చేసి మాకు ముక్తి దాతవయి,

మా మర్యాదను నిలుపుము.

 

19. శా. పున్నెంబెంతగఁ గావలెన్ గొలువ నీ పూజ్యాంఘ్రి సాహస్రమున్?

గన్నుల్ కాయలవెంత కాయవలె నిన్ గాంచంగ విశ్వేశ? పో

తన్నన్ గావలెనా నుతింప నిను మోహ భ్రాంతులన్ వీడి? శ్రీ

మన్నారాయణ! మా మదిన్ నిలువుమా! మమ్మున్ గృపన్ జూడుమా.

భావము.

శ్రీమన్నారాయణా! నీ పూజ్య పాదములను సేవించవలెనన్న మాకెంతటి పుణ్యఫలము

ఉండవలెనయ్యా? విశ్వేశ! నిన్ను చూచుటకొరకై ఎదురు చూచుచు కన్నులెంతగా కాయలు

కాయవలెను? మోహభ్రాంతులను విడిచిపెట్టి నిన్ను నుతింపవలెనన మేము భాగవతోత్తముఁడైన

పోతన్నగా అవవలెనా? మా మదిలో నీవు నిలిచియుండుము. మమ్ములను కృపతో చూడుము.

 

20. శా. జున్నున్, బాలును, మీగడల్, పెరుఁగు, సంశోభన్ మదిన్ దోచు నా

వెన్నల్, ఘుంఘుమలాడు నేయియును, సేవింపంగ నీకుండఁగా,

నన్నింటిన్ విడి మన్నుతింటివని మీ యమ్మే నినున్ గొట్టె, శ్రీ

మన్నారాయణ! చూడ నన్నిట నినున్మాకున్ బ్రబోధింపనో?

భావము.

శ్రీమన్నారాయణా! జున్ను, పాలు, మీఁగడ, పెరుగు, వెన్న, నేయి, ఇవన్నియు నీకు ఉండగా

వీటినన్నింటినీ విడిచి మన్నును తింటివని నిన్ను నీ తల్లి దండింపఁ జూచెను కదా! ఆవిధముగా

మన్నుతినుట,  నిన్ను అన్నింటిలోను చూచెడి విధానమును మాకు ప్రబోధించుట కనియా?

 

21. శా. ఉన్నావీవిట నన్నుఁ జేరి యని, స్నేహోత్సాహ సంపన్నులై

నన్నున్ మాన్యులు సన్నుతింతురయ. నేనా? నీవ? స్తుత్యార్హతన్

వన్నెన్ గాంచుట? నే గ్రహించితిని. నీ వన్నెల్ ననుం జేరి శ్రీ

మన్నారాయణ! నన్ను నిల్పుటను, సన్మాన్యత్వమున్ గొల్పుటన్.

భావము.

శ్రీమన్నారాయణా! ఇచ్చట నీవు నన్ను చేరి ఉన్నావని స్నేహ భావముచే కలిగిన ఉత్సాహమే

సంపదదగా కలవారైమాన్యులు నన్ను సన్నుతి చేయుదురు. స్తుత్యార్హతతో నీవా నేనా వన్నెను

గాంచిట? ఆలోచింపగా నీవు నన్ను చేరి నన్ను స్థిరపరచుటకును, సమ్మాన్యత్వము కల్పించుటకును

నీవు చేయుచున్నదని నేను గ్రహించితిని.

 

22. శా. నిన్నున్ గోరఁగ లేదు పుట్టుటకునై, నీవేలఁ బుట్టించితో?

పున్నెంబీయఁగ వేడ లేదు. నిను నే భోగంబులం గోరలే

దున్నన్నాళ్ళును నీదె బాధ్యత కదా! యుద్ధారకుండీవె. శ్రీ

మన్నారాయణ! కన్న నీవె సతమున్ మమ్మున్ గృపన్ జూడనౌన్.

భావము.

శ్రీమన్నారాయణా!నిన్ను మేము మమ్ములను పుట్టించమని మేము కోరలేదుకదా. మరి నీవేల

మమ్ము పుట్టించితివి?నిన్ను మేము పుణ్యమునీయమని కోరలేదు. భోగభాగ్యములను కోరుట లేదు.

ఉన్నన్నాళ్ళును బాధ్యత నీదే కదా.మమ్ములను ఉద్ధరించువాడవు నీవే కదా. మమ్ములను కన్నట్టి

నీవే ఎల్లప్పుడూ కృపతో చూడనగును కదా.

 

23 శా. పున్నెంబెన్నఁగ నేది యౌను? గుడిలోఁ బూజించ నిన్ బున్నెమా?

పన్నుల్ గట్టుచు నేల దున్ని ప్రజకై పండించుటే పున్నెమా?

ఎన్నాళ్ళైనను సేద్యమున్ విడిచి పూజింపంగ నెట్లౌను? శ్రీ

మన్నారాయణ నిన్ను నాత్మఁ గనుచుం బ్రార్థింప పున్నెంబెగా.

భావము.

శ్రీమన్నారాయణా! ఎన్నిక చేసి చూచినచో పుణ్యమనాగా ఏది యగును? గుడిలో నిన్ను పూజించుట

పుణ్యమగునా? పన్నులు కట్టుకొనుచు భూమిని దున్నుచు ప్రజలకై పంటలు పండించుట

పుణ్యమా?ఎన్నాళ్ళు గడుచుచున్నను వ్యవసాయము చేయుట మాని నిన్ను గుడికి వచ్చి కొలుచుట

ఎట్లు కుదురును? నిన్ను మనసులో తలచుకొని, ప్రార్థించినచో పుణ్యమేకదా.

 

24. శా. సాన్నిధ్యంబున నిల్పు నీకు ననునీశా భక్త కల్పద్రుమా!

సన్నద్ధుండను నీ పదార్చనవిధిన్ సంతోషమున్ బొంద నీ

దన్నున్నన్ భవ బంధముల్ తొలఁగు ఖేదంబుల్ విడున్ గాదె.  శ్రీ

మన్నారాయణ భక్తియుక్తిమెయి నీ మాహాత్మ్యమున్ గాంచనీ.

భావము.

శ్రీమన్నారాయణా! పరమేశా! భక్తులపాలిటి కల్పవృక్షమా! నన్ను నీకు సమీపమున నిలుపుము.

నీ పాదార్చన చేయుట అనే పని వలన సంతోషము పొందుటకు నేను సిద్ధముగా ఉంటిని. నీ దన్ను

ఉన్నచో భవ బంధములు తొలఁగిపోవును, భాధలు కూడా నశించునుకదా. భక్తితో

కూడుకొన్నవాడినయి నీయొక్క మాహాత్మ్యమును చూడనిమ్ము.

 

25. శా. ఉన్నావీవు మదిన్ సుచేతనముగా, నున్నావు దేహంబవై.

యున్నావెల్లెడ స్థావరంబులను నీవున్నావుగా దేవ మే

మెన్నంజాలని జంగమంబునను. నీవే సత్యమై నిల్చి, శ్రీ

మన్నారాయణ! కానలేకునికి యీ మాలోని `మాభావనే.

భావము.

శ్రీమన్నారాయణా! నీవు చైతన్య రూపములో నిత్యము మాలో ఉంటివి. శరీర ముగా ఉన్నదియు

నీవే. అన్ని కదలని వాటియందును నీవుంటివి. అన్ని కదిలెడి వాటియందును నీవుంటివి. నీవు

నిత్యుఁడవై అంతటను ఉంటివి. పరిపూర్ణ స్వరూపుఁడవైన మేము కానలేకపోవుటకు కారణము మాలో

గూడుకట్టుకొని యున్న మాది, మేము అనే మా అహం భావనయేయే కదా!.

 

26. శా. ఉన్నామంచు నహంకరించితిమొ? మేమున్నట్లు సాక్ష్యంబుగా

మన్నైపోవక వన్నెలన్వెలుఁగుచున్ మాన్యప్రథన్ జూపనౌ

నెన్నాళ్ళైనను. గాని లేమటుల మా యిచ్ఛానుసారంబు, శ్రీ

మన్నారాయణ! నీవె మేమగుటచే మాయన్నదే లేదిలన్.

భావము.

మేముంటిమి అని అహంకరించుచు మేము ప్రవర్తించుదుమా? అట్లైన మా ఉనికికి సాక్ష్యముగా

ఎన్నటికీ  మట్టిలో కలియకుండా, ఏన్నాళ్ళైనను కళ కాంతులతో మా మాన్యప్రథను ప్రదర్శింప

వలెను కదా? మరి మేము కోరుకొను విధముగా మేము ఉండలేము. శ్రీమన్నారాయణా! నీవే

మేమయి యుండగా మరి మా అనెడిది లేనే లేదు. అంతా నీవే సుమా!            

 

27. శా. నిన్నున్ నమ్ముదురయ్య మేలుఁ గనఁగన్ నిత్యంబిలన్ సజ్జనుల్.

నిన్నున్ నన్నును నమ్ముకొన్న ఘనులన్ నిష్ఠన్ గృపం గావు మా

పన్నత్రాతగ నిల్చి, భక్త సులభా! ప్రారబ్ధముల్ బాపు శ్రీ

మన్నారాయణ మంచి మార్గమిడు. సంపత్కారకా శ్రీధరా

భావము.

శ్రీమన్నారాయణా!   తమకు శుభములకొఱకు సుజనులు నిత్యమూ నిన్నునమ్ముదురు. నిన్ను,

నిన్నుగూర్చి తెలిపెడి నన్నును నమ్ముకొనెడివారిని నిత్యము నిష్ఠతో కాపాడుము. సంపత్కారకా!

శ్రీధరా! భక్త సులభా! ఆపదలనుండి రక్షించువాడివై నిలిచి మా ప్రారబ్ధములు పోఁగొట్టి, మాకు

మంచి మార్గమిడుము.

 

28. శా. నిన్నే గంటిని పండితాళి మదులన్ నేర్పార నుండంగ, ని

న్నెన్నున్ మన్నన నా సుధీమణి గణం బేమా మహత్వంబు! మా

కన్నుల్ ముందర నిన్ను నిల్పుదురు రాగ ద్వేషముల్ బాప, శ్రీ

మన్నారాయణ! పండితాళి మదులన్ భాసింతువో నిత్యమున్?

భావము.

శ్రీమన్నారాయణా! పండితుల మనసులలో నీవు నైపుణ్యముతో ఉండగా నేను వారిలో నిన్నే

చూచితిని. జ్ఞానుల సమూహము మన్నన చేయుచు వారి మనసులలో నిన్నే ఎన్నును. అహా! ఏమా

గొప్పఁదనము! మాలోని రాగద్వేషాదులను మటుమాయము చేయుట కొఱకు నీ గాధలు తమ

ఉపన్యాసములద్వారా ఆవిష్కరించుచు మా కన్నులముందు నిన్ను నిలుపుదురుకదా. నీవు

ఎల్లప్పుడు పండితుల మనసులలో ప్రకాశించుచుందువా.

 

29. శా. కన్నుల్ నిండుగఁ గాంతిరేఖలవిగో కారుణ్యపూర్ణంబులై,

మిన్నున్ మించెడి నీలివర్ణమదిగో మేలైన నీ మేనునన్,

కన్నుల్ పండువ కాదె కాంచ నిను శ్రీకాంతా శుభోపేత! శ్రీ

మన్నారాయణ! భక్త పాలన గుణా! మాకన్నులందుండుమా!

భావము.

భక్తపాలనగుణసంపన్నుడవైన శ్రీమన్నారాయణా! ఆహా! మా కన్నులు నిండుగా కారుణ్యముతో

ప్రకాశించుచు కనిపించు నీ కాంతిరేఖలు అవిగో, కనిపించుచున్నవి. ఆకాశమును మించిపోయెడి

నీలివర్ణము అదిగో నీ శరీరమున కానవచ్చుచున్నది. శ్రీకాంతుడా! శుభోపేతుఁడా! నిన్ను

చూచినచో కన్నులపండువేకదా. నీవు మా కన్నులలోనే ఉండిపొమ్ము.

 

30. శా. ఎన్నో జన్మలు ఘోరమైన తపముల్ హృద్యంబుగాఁ జే సినన్

నిన్నుం జూడగఁ జాలరైరి ఋషులో నిత్యుండ! నీవే మమున్

గన్నారన్ గనుడంచుఁ జూపుదువు నీ కల్యాణ రూపంబు, శ్రీ

మన్నారాయణ! సర్వమీవె కద! ప్రేమన్ జూతుమన్నింట నిన్.

భావము.       

నిత్యుఁడవైన శ్రీమన్నారాయణా! ఘోరమైన తపస్సులు ఎన్నో జన్మలు హృద్యముగా చేసినప్పటికి

ఋషులు నిన్ను చూడలేకపోయిరి. నీ మంగళప్రదమైన రూపమును మమ్ములను కనులారా

చూడమని చూపుదువు నీవు. అంతా నీవే కదా. నిన్ను మేము అన్నింటియందును ప్రేమతో

చూచెదము.

 

31. శా. నిన్నుం జూచెదఁ బక్షులన్ బశువులన్, దృగ్గోచరంబౌచు నీ

వెన్నింటం గలవన్నిటన్ గనియెదన్ సృష్టిన్ వివేకంబుతోన్.

భిన్నంబింతయుఁ గానరాదవియు నీవేగా! దయాపూర్ణ! శ్రీ

మన్నారాయణ! నీవె లేని యెడలన్ మాకెట్లు కానంబడున్?

భావము.

శ్రీమన్నారాయణా! పక్షులయందున, పశువులయందున నేను నిన్నే చూచెదను సుమా. కంటికి

కనఁబడుచు నీవు ఎన్నింటిలో ఉండియుంటివో అన్నింటియందును నిన్ను వివేకముతో చూచెదను.

ఏమాత్రము భేదమనునదే సృషికి నీకు మధ్య కనఁబడదు. కనిపించెడి గొప్ప శోభలెల్లప్పుడు నీకు

సంబంధించినవే కదా! నీవు లేవు అనునదేదైనా ఉన్నచో అది మాకు ఏవిధముగ కనబడును?

 

32. శా. మన్నైపోవడు దేహి. దేహ జగతిన్మార్తాండుఁడై వెల్గు నె

నెన్నోకర్మలొనర్ప జేసి తుదకున్ హీనంబు గాన్ శక్తి, యా

క్రన్నన్వీడి పరంబు చేరు, నిహమున్ బ్రాప్తించు బాపంబొ. శ్రీ

మన్నారాయణ  పుణ్యమో. తమరివే. మాకేలనీ ప్రాప్తముల్. 

భావము.

ఓశ్రీమన్నారాయణా! దేహముననుండు దేహియైన ప్రాణశక్తి మట్టిగా అవడు. అతడు

యీ శరీలమనెడి లోకములో సూర్యుడై వెలుగుచుండి దేహముచే ఎన్నో కర్మలను

చేయజేసి, తుదకు శరీరమునందలి శక్తి క్షీణించగా శరీరమును విడిచి

వెడలిపోవును. ఇక్కడ చేసెడి కర్మల వలన లభించెడిది పాపమో లేక పుణ్యమో, అవి

తమరివేసుమా. కర్మ ఫలములు మాకవసరము లేదు.

 

33. శా. మిన్నున్ మన్నునునేకమైననగు, నీ మీదన్ బ్రమోదంబు పొ

మ్మన్నన్ బోవఁగరాని మార్గమిడు నీ మంచిన్, మనోజ్ఞంబుగా

నెన్నంజాలు పదంబులే దొరకవే, హే భక్త మందార! శ్రీ

మన్నారాయణ! నీ పదాంబుజములన్ మాకందనీ కొల్వఁగా.

భావము.

ఓశ్రీమన్నారాయణా! ఆకాశము భూమి ఒకటిగా ఐపోయినను ఐపోవచ్చునుగాక.మాకు నీపై ఉన్న

మిక్కిలి యిష్టము మాత్రముపొమ్మన్నను పోకుండా ఉండు మార్గమును మాకు

కల్పించునటువంటినీలో ఉన్న మంచిని మనోజ్ఞముగా ఎన్నుటకు తగిన పదములే కరువైపోయినవి.

భక్త మందారా! నీ పద పద్మములనుమేము కొలుచుకొనుటకు వీలుగా మాకు అందనిమ్ము.

 

34. శా. విన్నన్ జాలును నీ మహాద్భుత కథల్ విశ్వాసమున్ నిల్పి. నే

నున్నానంచు మనమ్మునన్ నిలిచి దీనోద్ధారకుండా మమున్

మన్నైన దగులంగనీక జగతిన్ మన్నించి కాపాడు శ్రీ

మన్నారాయణ! భక్త బాంధవ! తరమ్మా నిన్ బ్రశంసింపగన్?

భావము.

దీనులనుద్ధరించెడివాడవైనఓ శ్రీమన్నారాయణా! నీపై విశ్వాసముంచి నీకు సంబంధించిన

అద్భుతమైన కథలను విన్నచో సరిపోవును. నేనున్నాను మీకు అనుచు మా మనస్సులలో

నీవునిలిచి మాచేతికి ఎటువంటి ఖిలము అంటుకోకుండా చూచుచు, లోకమును కాపాడు

భక్తబాంధవుఁడవు. అట్టి నిన్ను ప్రసంసించుట మా తరమగునా.

 

35. శా. నిన్నేనమ్ముచు నైహికంబుఁ గనరే నిన్గాంచు భక్తాళి, నీ

దన్నున్ గైకొని జీవనంబు గనరే దారిద్ర్యనారాయణుల్,

కన్నా! ని న్నెదలందుఁ గాంచు ఘనులన్ గాపాడు నిత్యంబు శ్రీ

మన్నారాయణ! భక్త పాలన చణా! మా మాట మన్నింపుమా.

భావము.

భక్తులను పాలించుటయందు నైపుణ్యము కలవాడా! శ్రీమన్నారాయణా!మహనీయులు

నిన్నేవిశ్వసించిఐహిక వాంఛలను విడిచిపెట్టి మనుచుడిరి. దారిద్ర్యముతో

కొట్టుమిట్టాడుచున్నవారు నీ దన్నునే నమ్ముకొని జీవితమును గడుపుదురు. కన్నా! నిన్నే నిత్యము

మనసులో భావించు మహనీయులను నిత్యము నీవే కాపాడుము. విషయములో నీవు మా మాటను

మన్నించితీరవలయునుసుమా.

 

36. శా. పన్నీటన్ జలకంబు లాడెదవు. నీ భక్తాళిచే నిత్యమున్,              

గన్నీరింతయు కారనీయని మతిన్ కారుణ్యమే చూపవా?

యెన్నాళ్ళీ కరుణావిహీన మతివై యిట్లుందువో నీవు శ్రీ

మన్నారాయణ! కావు భక్త జనులన్ మన్నించి పోషించుమా!

భావము.

శ్రీమన్నారాయణుడ! నిత్యము నీ భక్తుల సమూహముచేత పన్నీట జలకములాడెదవు.

అట్టిన్నీకు, భక్తులకు కన్నీరించుకైనను కారకుండా చూచే కరుణా స్వభావమే లేదా యేమి?

నీవింకాఎన్నినాళ్ళు విధముగా కరుణ లేనివాడవై విధముగా ఉందువు?భక్తజనులనుమన్నించి,

కాపాడుచుచు, వారిని పోషించుము.

 

37. శా. నిన్నున్ గోరెద నాలకించు మనవిన్ నిత్యా! లసద్భక్తి సం

పన్నుల్, పేదలటంచు నెంచకుము. సంభాసించు నీ మానసం

బెన్నంజాలఁ గఁ జేసి మేల్కొలుపు, నీవే వారియందుండి శ్రీ

మన్నారాయణ! సత్య పోషణ గుణా! మాన్యావనా! శ్రీఘనా! 

భావము.

శ్రీమన్నారాయణా!సత్యమును పోషించు గుణము కలవాడా! శ్రేష్ఠమైన పూర్ణ చంద్రుని బోలు

ముఖము కలవాడానిన్ను నేను కోరుచుంటిని. నా మనవినాలకించుము. గుణ సంపన్నులనీ,

పేదలనీ భేదమునుకనిగియుండకుము. వారిలో నీవుండి ప్రకాశించే నీ మనసును గుర్తించునట్లు

చేయుము. .

 

38. శా. జన్నంబుల్  పచరించి సాధకుఁడు నీ సామీప్యమున్ జేర తా

నెన్నున్. నేనెటు నిన్నుఁ జేరుదునొ? నే నే జన్నమున్ జేయలే

దిన్నాళ్ళైనను. దేవదేవ నిను నే నే రీతి దర్శింతు? శ్రీ

మన్నారాయణ! నీదు నామ జపమే మార్గంబుగానెంచితిన్ !

భావము.

శ్రీమన్నారాయణా! నిన్ను దర్శింప గోరు సాధకులు యజ్ఞములాచరించినీ సమీపమునకు చేరగా

తలంచును. నేను నిప్పటికినీ యజ్!జమూ చేయలేదు కావున విధముగా నిన్ను చేరగలను?

దేవదేవా! నేను నిన్నేరీతిని దర్శింప గలుగుదును? నిన్ను చేరుట కొఱకు నేను నీ నామ జపమును

మాత్రము మాననుసుమా.

 

39. శా. అన్నంబో రఘురామ యంచు జనులాహారంబు నర్ధింత్రుసం                                                                                   

పన్నుల్ క్రిందను, మీదఁ బోయుదురు. భవ్యా! నీ మదింగాంచితే?                                                                                        

యన్నంబీవె.  లభింపుమందఱికి.  దేహార్తిన్ దొలంగించు! శ్రీ