గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, సెప్టెంబర్ 2026, బుధవారం

రేనాటి సూరీడు...తృతీయాశ్వాసము.

తృతీయాశ్వాసము.

శా.  శ్రీలక్ష్మీనరసింహ దైవమ! జయశ్రీభాగ్యసంధాయకా!
నీ లీలల్ గణియింప మాకుఁ దరమా, నీవే మమున్ ధాత్రిపై
క్రాలన్ బుట్టఁగఁ జేయుచున్, గరుణతోఁ గాపాడుచున్, నిత్యమున్
జాలిన్ జూపుచు నిల్పుచుందువయ! నేఁ జాలన్ స్తుతింపంగ నిన్!   1.
నరసింహారెడ్డి తనతోటివారిని ప్రోత్సహించుచుఁ బలుకుట.
.  తనతో వెన్కనె యుండ వచ్చిన ఘనుల్, "ధర్మవ్యవస్థాపనా
చణుఁడీ శ్రీనరసింహరెడ్డి యనఁగా, సాధింప స్వాతంత్ర్యమున్
మనకీతండిల దైవమంచనగ" నా మాన్యుండు రాధాన్యముల్
తనతో నుండెడివారికిచ్చుచు నిటుల్ తా పల్కె విఖ్యాతిగాన్.      2.
.  పరమోదారగుణాఢ్యులార! ఘనమౌ ప్రాధాన్యతన్ గల్గు నో
పరమార్థంపు సుసాధనార్థ మిచటన్ బ్రఖ్యాతిగా నెన్నగన్,
బరతంత్రంబుల నెన్ని వాటికిఁ బ్రతిన్ భావించి చర్చించుచున్
చరియింపన్ దగుదాని నెన్నుటయె సుజ్ఞానంపు మార్గంబగున్.     3.
.  దురితుల్ భారతదేశ సంపదలనే దోచంగ నాంగ్లేయులే
పరమోపాయముతోడ వచ్చి స్థిరులై పాలింపఁగా నెంచి, సు
స్థిరమౌ భారత జాతిలోని ఘన మైత్రీబంధముల్ త్రుంచి, యం
దరి నీ ధాత్రిని వేరుచేసి,  తమదౌ దారిన్  మనన్ నిల్పిరే!      4
చ`తురంగ స్వస్తిక్ బంధ భావ గోపన చిత్ర లఘు కందము.
తురంగ గతిలో గోపిత భావము.   మనమిల - నొకటిగ - మెలఁగిన - శుభమగు
భావగోపన చిత్ర చ`తురంగ స్వస్తిక్ బంధ 
ఘు కందము.
నిపుణత నొకటిగ  మెలగిన
నిపుడిట  ప్రథమ శుభమగు మహి వినఁగ,  శుచితోన్
దపమిలను  నొకటె నుతిగ ఘ
న  పటిమఁ గన మెలగి, జగమున  వెలుఁగఁగ వలెన్.      5.
.  తనతోవచ్చెడివారలందరు నొకే దారిన్ బ్రవర్తింపగా
ఘనుఁడై రెడ్డి యొనర్పగల్గి, యచటన్ గణ్యాత్ముఁడై యోధుఁడై
మనగల్గెన్, మనునట్లు చేయఁగలిగెన్ మాన్యంబుగా నందరిన్,
మనమార్గంబది ధర్మ మార్గ మయినన్  బ్రఖ్యాతిగా వెల్గమే?     6.
శా.  యోధాగ్రేసరుడైన యోబయయు, శ్రేయోదాయకుండైన స
న్మేధా మూర్తి మహత్వ శక్తియుతుఁడౌ మేల్ పైడి వేంకన్నయున్,
స్వాధీనంబుననుండుటన్ దొరయు నిస్వార్థంబుగా నిత్యమున్
బోధన్ గల్గుచు మెల్గుచుండె ధరకున్ బూర్ణంపు స్వేచ్ఛన్ గనన్.  7.
.  భవితన్ గాంచెడి శక్తిఁ గల్గు ఘనుఁడౌ, భక్తాగ్రగణ్యుండునౌ,
స్తవనీయ ప్రతిభా సమన్వితుఁడునౌ, ధర్మాత్ముఁడౌ వేంకనన్
భువిపైఁ గల్గిన దైవమట్లు కనుచున్ బూజ్యంబుగా చూచు నీ
నవనీతాత్ముఁడు రెడ్డి, యీ ధరణిపైనన్ వెల్గె ధన్యాత్ముఁడై.   8.
మ.కో.  పాలెగాండ్రుగనున్నవారలు పన్నులన్ గొను పద్ధతిన్
మూలమంటను మార్చివేసెను పూర్తిగా తన పాలనన్
బాలెగాండ్రవ్యవస్థ రద్దయి వారికిన్  భృతినిచ్చుటే
చాలటంచును చేసె మన్రొ విషాదమున్ గలిగించుచున్.      9.
.  కొందరు పాలెగాండ్రు తమకున్ వలదీభరణంబటంచు తా
మందరునేకమైరి, తమదైన వ్యవస్థయె కోరుకొంచు, నీ
యందరునాంగ్లపాలకులనడ్డిరి మన్రొ విధానమేలటం
చిందుఁ గనంగనష్టమని యెగ్గులు పల్కి యెదిర్చిరుద్ధతిన్.     10.
గీ.  అట్టివారిని బంధించి పెట్టినారు
పుడమి పయిని కారాగారములను ప్రభువు,
లచ్చటే వారు మరణించిరయ్యొ, చేత
కాక విలపించుచున్,  దిక్కు లేకపోయె.              11.
.  చేయఁగ లేక యేదియును, చేవయుడింగిన పాలెగాండ్రు ప్రా
ధేయ పడం దొడంగిరి విధేయత చూపుచు పెంచఁగా భృతిన్,
సాయము చేసినట్టులుగ సర్వము దోఁచి యొసంగుచుండిరే,
యీయవమాన భారము సహించుట కష్టమటంచు నెంచిరే.   12.
.  భృతి మజ్జారికుటుంబమంతకునువారిచ్చున్ బదేడుల్ విధీ!
గతి యాకొంచెమె, పంచుకొందురదియే, గత్యంతరంబేది? యీ
స్థితిలోనన్ జయరామరెడ్డి సుతుగా చెల్వొందువాఁడౌటచే
నుతిగావారికి దక్కునట్టి భృతి తానున్ బొందునీరెడ్డియున్.  13.
గీ.  తాత తదనంతరంబున తల్లికిచ్చి
రామె పిదపనా భృతి నీయరాయె దత్తు
డయిన నరసింహరెడ్డికి నతఁడు సుతుఁడు
కాడటంచును ప్రభువులు, కర్మ మిదియె.             14.
గీ.  తండ్రి కందెడి భృతిలోనఁ దాను పదునొ
కండు రూప్యముల్  గొనుచును గడుపుచుండె.
నరసరెడ్డి యాకొంచెమున్ సరిగనొసఁగ
కుండ నాపెనా యధికారి కుత్సితుఁడయి.           15.
గీ.  రాఘవాచారి యాతఁడు, రాజువోలె
తనదు కార్యాలయమునందు తలబిరుసుగ
వచ్చువారిని యదలించి వదరుచుండు,
కాలగతిలోన తానును రాలకున్నె?                  16.
.  నరసింహుఁ డంప, కాసిము
నరసింహుని భృతి నడుగగ, నవ్వుచు నాచా
రరెరే రెడ్డియె భృత్యుఁడు,
ధర భృత్యున కితఁడు భృత్యుధర్మము నెరపెన్.      17.
గీ.  అనుచు నదిలించి, యాతని నడుగుకొనగ
రమ్మటంచును పంపుము, రానియెడల
నీయఁబోనని తెల్పుము, నేతవోలె
సేవకునిపంపుటే తప్పు, చెప్పుమిటుల.           18.
గీ.  రాఘవాచారి మాటలన్ రగిలి మనసు
నరసరెడ్డికి వినిపించి, దొరవు నీవు,
నిన్నె దూషించి భువిపైన నెన్నినాళ్ళు
బ్రతుకఁ గలఁ డతండనుచు తా బాధపడెను.            19.
శా.  క్రోధజ్వాలలె కన్నులా యనునటుల్ కోపంబె రూపంబుగా
బాధాతప్త మనోవికారమున తా వ్రాసిచ్చె నో లేఖ, నీ
వే దీనిన్ గొనిపోయి చారికిడుమా, వేయేల మాటల్ సఖా!
ఆదిత్యుం డపరాద్రిపై పొడుచుగా కాలేఖ సత్యంబగున్.      20.
గీ.  చేతఁ గొని లేఖ రెడ్డికిఁ జేసి నతుల
నశ్వమునునెక్కి యరిగె తా నతులితముగ,
గర్వభంగంబు చారికి కచ్చితమిల
ననుచు భావించుకొనుచును మనమునందు.            21.
1846. జూలై 9 ని రెడ్డి ఇచ్చిన లేఖము కాసిం రాఘవాచారికందించుట.
సీ.  ధరణి పద్ధెమ్దివందలనల్బదారున, జూలయి మాసాన, భీల రాత్రి
పదకొండు గంటల కదురునట్టుల నేల, యశ్వంబుపై చేరె నతఁడొకండు,
నరసింహు సఖుఁడు తా నరయుచు రాఘవాచారి కడకు వచ్చి చేరి యొక్క
లేఖనందించఁగా, లేని ధైర్యము చూపి యెవ రంపి రీలేఖ యిచటికంచు
గీ.  నడుగు లోపలనే చనె నచటినుండి,
లేఖ తెచ్చినవాఁడు, నా లేఖ తీసి
రాఘవాచారి చదువుచు ప్రాణములను
విడిచినట్టులె చింతించె భీతిలుచును.                22.
.  తానొక కాంతతోఁ గలిసి ధర్మవిరుద్ధముగా రమించుచున్
హీనచరిత్రుఁడై మసలు నింటనె యుండిన యట్టి చారియే
దీనముగాఁ గనంబడగ, దేవర! లేఖనెవండు పంపెనం
చేను గ్రహింపఁ దెల్పుఁడని యింతియె చారిని గోర, తా ననెన్.  23.
.  నను చంపంగ నృసింహరెడ్డి కసితో నా వాసమున్ జేరి, తా
క్షణమందున్ వధియించి నన్ను, ధనమున్ గైకొంచు పోనుంటి నే
నని వ్రాసెన్, భయమొందుచుంటి ననగా నా కాంత దిగ్భ్రాంతితో
ఘనుడట్లన్నను కావ నెవ్వరి కగున్? గాపాడుతన్ దైవమే.       24.
.  అనుచున్ బోవఁగ తా గృహ మ్మునకు, దేహభ్రాంతి నాచారి పో
యెను కార్యాలయ ప్రాంగణమ్మునకు, నే నిప్పట్టు నీ వార్తలన్
వినయంబొప్పగ పై నధీశుల కిదే విన్పింతు లేఖాకృతిన్
నను రక్షింపుడటంచు కోరుదును, లోనన్ దాగి యిందుండెదన్. 25.
.  అనుచు లేఖవ్రాసి  యధికారికంపగా,
నతడు పంపె వందలాది సైని
కులను మరియు ప్రతిభఁ గలుగు వార్సింగును   
రక్షణమును గొలుప రహిని యఁటకు.               26.
1846 జూలై10వ తేదీని మధ్యాహ్నము 12 కి కోవెలకుంట్ల ట్రెజరీపై రెడ్డి దాడి చేయుట.
సీ.  పదవతేదీ నాడు పదునెమ్ది వందల నల్బదార్ జూలయి నరస దొరయు
నైదువందల సైన్య మవని కంపించఁగా కోవెల కుంట్లకుఁ గోరివెడలు
సమయమందున జనుల్  సన్నుతించుచు రెడ్డి కాశీర్వచనములనందఁజేసి
విజయము కాంక్షించి విర్రవీగెడి పాలకులను వధించగా వలచినారు.
గీ.  జయము నరసింహరెడ్డి దిగ్జయము మీకు,
సైనికాళికి జయమగు సన్నుతముగ 
ననుచు భావించి దీవింప నందరటుల
సాగుచును వారు ముందున కేగినారు.              27.
గీ.  రాఘవాచారి, వార్సింగు, ప్రస్తుత మట
నెడ్వరుడు తోడ కూర్చుండి రెపుడు రెడ్డి
వచ్చునోయంచు భీతితో నచ్చటికని,
తప్పు చేసినన్ శిక్షయు తప్పదుకద.             28.
గీ.  భయముతో రాఘవాచారి వారుసింగు
నడిగె నరసింహరెడ్డిని వడిగ మీరు
చంపఁగలరా? యటంచును సందియముగ,
కోపముగఁ జూచె వార్సింగు క్రుంగ నతఁడు.            29.
.  కోశాధికారి! యాచా
ర్యా! శంకించెదవదేల ననుపమ రీతిన్
నీ శత్రుని మడియించెద
నా శక్తిని జూపి, చూడు నను ననె వార్సింగ్.           30.
.  అతఁడటు చెప్పుచుండగనె యావల గుఱ్ఱపుడెక్కలధ్వనుల్,
మతి చెడి వారుసింగఁట ప్రమాదమునెంచుచు వచ్చె బైటికిన్,
క్షితిఁగల ధూళి రేగునటు చేరి నృసింహుని సైనికోత్తముల్
ప్రతిన యొనర్చినట్టులుగ పట్టి వధించుచునుండిరాంగ్లులన్.    31.
.  ఏడి నృసింహరెడ్డి? యతఁడెక్కడ నుండె? నటంచు చూచుచున్,
వాఁడె మహాశ్వ మెక్కి యిటు వచ్చుచునుండె నటంచు, వారుసింగ్
పాడియ చంపు టీతనిని పంతముతోనని పట్టి కాల్చ నా
వాడు తుపాకిగుం డతని ప్రక్కగ పోయెను, తప్పె ముప్పటుల్.  32.
.  మరియొకమారు పేల్చుట కమాంతము గుండును క్రుక్కుచుండగాన్
మెరుపన వచ్చి వేగమె యమేయ బలాన్విత రెడ్డి వారుసింగ్
శిరమును బట్టి త్రుంచె తన చేతిని గల్గిన కత్తితో వడిన్.
పరమ విరోధియై చెలగు పాపిని చంపక యెట్టులుండనౌన్?   33.
వధింపఁబడఁ దగినవాఁడు ఆతతాయి
గీ. అగ్ని విషములు పెట్టెడి యధముఁడయిన,
నాయుధంబున జంపెడి యశుభుఁడయిన,
క్షేత్ర దారల హరియించు కౄరుఁదయిన
నాతతాయియె, ధర్మంబునరసి చూడ.                  34.
.  గురువయిన, బాలుడయినను,
నిరుపమ వేదవిదుఁడయిన, నెలతియె యైనన్,
ధర నాతతాయి యైనను
కరుణింపక చంపుటొకటె ఘన ధర్మంబౌన్.              35.
.  తన ధనము నీయకుండగ,
తన మానము చెరచె నాతతాయి యితండం
చని తలఁచి, యితనిఁ జంపుట
ఘన మార్గమె యనుచు నెంచె ఘనుఁడగు సైరా.         36.
.  గౌరవ హాని యన్నదిలఁ గాంచఁగ మృత్యువు కన్న మిన్న, నా
గౌరవభంగమున్ గొలిపె కారులు ప్రేలుచు సేవకాళితోన్,
వీరత నొప్పియుండియు నుపేక్ష వహింపక, యాతతాయి నే
దారుణమైన ఖడ్గమున తప్పక చంపెద  వీరరాఘవున్.     37.
.  అని మనమున చింతించుచు
ఘనమగు ధర్మంబు నెరప కదలిన ఘనుఁడా
క్షణమున భీకర ఖడ్గము
తన హస్తమునందు రెడ్డి ధరియించి, చనెన్.            38.
.  రిపుసైన్యంబది చూచి పర్విడగ, వారిన్ వీడి, యాచారిపై
కుపితుండై వధియింప వచ్చి, గదిలో కూర్చున్న వానిన్ గనెన్,
"విపరీతం బొనరించితిన్ క్షమను నీవే నన్ను రక్షింపుమం"
చపుడాచారి వచించుచున్ బడియె తా నా పాదపద్మాళిపైన్.     39.
.  వాఁడి శరీరమొక్కటియె పాదములన్ గనవచ్చె, శీర్షమో
వీడుచు ఖడ్గఘాతమున వేరుపడన్ గనె నెడ్వరుండు తా
నీడనె యున్న కీడనుచు నేగఁగ ముందున కుద్యమింప, నె
వ్వాఁడవు పోవుచుంటివని పట్టె నృసింహుఁడు హుంకరించుచున్. 40.
.  వానికి ముండనంబు ననివార్యముగా నొనరింపఁజేసి, య
వ్వానిని వస్త్రహీనునిగ పర్విడఁ జేయుచు వీథులందునన్,
జ్ఞానవిహీన! నీ ప్రభువు గారికి చెప్పుమిదంతయున్ వడిన్,
నే నయనాల కొండపయినే వసియింతును, చంప రమ్మనెన్.   41.
.  బొందిలి వంశపు హరిసిం
గందుండెను రక్షకుఁడయి యచ్చటి నిధికిన్,
కొందలమందెను రెడ్డియె
యం దక్కడకు నరుదెంచు నతనిని గనుచున్.             42.
గీ.  ఎవ్వఁడవు నీవనుచడిగె నృహరి, యతఁడు
రక్షకుఁడ నిట, యనుచు, మీర లెవ రనెను,
ధనము గొనిపొమ్ము వలయుచో ధరణిఁ బ్రతుక
మనె నతనితోడ, కాకున్న మనవనియెను.            43.
శా.  నే ధర్మంబును తప్ప, నాంధ్రుఁడనయా! నిత్యంబు కాపాడుదున్,
మేధామూర్తిగఁ దోచుచుంటివయ, స్వామిద్రోహమున్ జేయనా?
వాదౌమార్గము వీడఁబోను, ప్రభులన్ వంచింపఁగా లేను, నా
కాధారమ్ముగ జీతమిత్తురయ నా కద్దానితోఁ దృప్తియే.       44.
.  అనియాతండు వచింప, రెడ్డియనె నేలా నీవు నా మాటలన్
విన విట్లైనను చత్తు వీ వనగ నీవే గొప్ప యోధుండవా?
యనినే చేసి వధించు నన్ననెను, దేహభ్రాంతిదూరాత్ముఁడై,
కొని ఖడ్గమ్ములనిద్దరున్ వడివడిన్ ఘోరంబుగాఁ బోరిరే.   45.
గీ.  కొంత తడవిట్లు సాగ నా చెంతనున్న
యొడ్డె యోబన్న సింగును నడ్డిపైన
శూలమును గ్రుచ్చ నెంచె నావేళలోన
నోబయను తిట్టె రెడ్డి యనుచితమనుచు.             46.
.  తడబడ రిద్దరున్, రణము ధర్మముగా కొనసాగుచుండె, న
య్యెడ నరసింహరెడ్డి గ్రహియించి పరిస్థితి, యిప్పుడిచ్చటన్
దడయుట పాడి కాదనుచు, తా హరిసింగు శిరమ్ము త్రుంచగాఁ
బడెనది నేలపై, నకట పంతమదెంతటి ప్రాణహానియో?       47.
గీ.  భారతాంబకు జయమంచు పలికి తుదను
ప్రాణములు వీడె సింగు, తద్ వాక్కులు విని
రెడ్డి దుఃఖించె, హరిసింగు దొడ్డగుణము
నెన్నసాధ్యము కానంత మిన్న యనుచు.                 48.
.  చావు నకును సింగు సంసిద్ధుఁడాయెను,
వృత్తిధర్మ మరసి విడువ లేక,
సీమగడ్డపైన చిగురించు మొక్కయు
చేవఁ  గలిగియుండు చిత్ర మిదియె.                 49.
గీ.  రెడ్డి మనుజు లీలోపల దుడ్డు దాచు
చోటు వెదకుచు చేరిరి సుకరముగనె,
ధనము నాగారమందుండి కొనిరి వారు,
సాహసము గల్గ నేది యసాధ్యమగును?            50
.  అష్టశతము మీద నైదు రూప్యంబులు,
పదియణాల నాల్గుపైసలుగొని
మూటకట్టి యచట ముందుగా సిద్ధమై
నరసరెడ్డితోడఁ దరలినారు.                           51.
.  ఖండిత శీర్షముల్ గొనిరి గర్వముతో, నటఁ గల్గు నన్నిటిన్
మండగ నిప్పుపెట్టి రవి మండుచు నన్నియు భస్మమయ్యె, మా
కండ శివుండెయంచు పరమాధ్బుతమౌ నయనాలపాద్రిపై
నుండు మహేశుమ్రొక్కి, యటనుంచిరి యాగుహలోన శీర్షముల్.52.
గీ.  తానఁటేగి దువ్వూర్ఖజానాను కొల్ల 
గొట్టె నరసింహ రెడ్డి, జై కొట్టఁ జనులు,
మనసునకుబాధ కలిగిన మానవుండు
మరచిపోవునె? ప్రతిచర్య? నరయకున్నె?                 53.
.  ఇరువురి శిరములు నరికిన
భరియించుచు నూరుకొన నపప్రథ యనుచున్
నిరుపమ బలమున వచ్చెద
రరివర్గ మడంచ మమ్ము నని యనుకొనుచున్.             54.
.  నొస్సముకోట ముట్టడి ననూహ్యముగా జరిపించవచ్చు, నే
నిస్సి! దురంత దుష్కృతుల నెట్లు సహింతును ముట్టడిన్? ధరన్
దుస్సహమిద్ది, రక్షణము దూరమునుండియు చేయువాఁడినై
యస్స లుపేక్ష చేయ కనుయాయుల సూచనలందు దిప్పుడే.    55.
గీ.  అనుచు నరసింహరెడ్డి తా నాకుమళ్ళ
వినుత గోసాయి వేంకన్న ఘనునొకనిని,
యొడ్డెవంశజుండగు వీరరెడ్డినొకని
కలిసి మాటాడె రక్షణఁ గొలుపు పనులు.                 56.
మ.కో.  కోటచుట్టును కందకంబు లకుంఠితంబుగ త్రవ్వుచున్
నీటితో పరమాద్భుతంబుగ నింపునట్లుగ చేసెనే,
కోటపై మరిగించు తైలపు కుండలుండఁగఁ జేసెనే,
పోటుగా ళ్ళట నుండునట్టుల పూర్తిగా నొనరించెనే.          57.
గీ.  కందకంబులలోపల కంటకములు
గుట్టలుగ బోయఁ జేసెను పట్టుపట్టి,
చుట్టు ప్రక్కల పొలములం జొరఁగ రాని
యట్లు బురదగా చేయించె ననుపమగతి.                 58.
మ.కో.  భీకరంపు పిరంగు లెన్నియొ పెట్టి యుంచిరి బుర్జులన్,
బ్రాకటంబుగ చంపగా రిపువర్గమున్ ధృతినొప్పుచున్,
లోకమాతను నమ్మి శాత్రవలోకమున్ మడియించఁగా
నేకమై రిల పాలెగాండ్రు రహింపఁ జేయగ స్వేచ్ఛనే.        59.
గీ.  చుక్క మంచినీరైనను చూచువారి
కెక్కడను కాన రాకుండ చక్కగాను
బావులన్నియు పూడ్పించి, క్రేవలందు
గుంతలను పైన కప్పించె, కూల రిపులు.               60.
సీ.  స్థానికులకు తోడు చక్కగా నౌకురాజయిన నారాయణ నయనిధాన
పరివారమును గూర్ప,  పరమాద్భుతాయుధ సామగ్రితోడను శత్రుచయము
నుక్కడింపఁగ సిద్ధమక్కజంబుగనయి, యెదురుచూచుచునుండె నిటకు వచ్చు
వైరుల కొఱకు సుస్మేర ముఖుఁడు రెడ్డి, వారింపనతని నెవ్వారికగును?
.  స్థానబలమె కాదు, సాధించు ధైర్యంబు
నాత్మశక్తిఁ గలిగి,  యద్భుతమగు
దైవబలముకల్గి, దార్ఢ్యంబునున్ గల్గి,
రిపుల కొఱకు నరస రెడ్డి చూచె.                      61.
గీ.  కడపజిల్లాకె యధికారి కాక్రెనునకు
రాఘవాచారి హత్యవార్తయును, ధనము
దోపిడీవార్త చేరఁగా, గోపముబికి
హంతకులఁబట్టు యత్నంబు నతఁడు చేసె.               62.
గీ.  రక్షకభటులు నరసింహు నాక్షణమునె
కలిసి, విషయంబు తెలిపిరి, తెలిసికొనఁగ
హంతకుని గూర్చి చెప్పుఁడంచడిగినారు,
తానె హంతకుఁడయ్యును మౌనమూనె.                  63.
గీ.  వారి నాడింపఁ దలచి తా పలికె నిట్టు
లౌకు రాజింత పనిఁ జేసె నంచు తలతు,
నిజము నెఱుగంగ యత్నించి నేర్పుతోడ
దోషులనుపట్టఁ జూడుడం చాసఁ గొలిపె.                64.
.  అతని మాటలు విని యౌకురాజునతని
సోదరునిని బట్టి ఖేదమొదవ
చెరను బెట్టియుంచి, సరియగునాధార
ముల కొఱకని యత్నములను జరిపి.                   65.
తోటకము.(స స స స . యతి 9.)
పరిశోధన చేసిరి  వారలటుల్,
పరికింపఁగ దోషు లవశ్యముగా
పరులంచు గ్రహించిరి,  బంధితులన్
గరుణన్ విడిపించిరి, గణ్యముగాన్.                    66.
గీ.  ఔకురాజునున్, దమ్ముఁడున్  శ్రీకరుండు 
హరియె రక్షించునని నమ్మి, యతని రక్షఁ
బొంది విడిపింపఁబడి, శాంతి పొంది మదిని,
వారి వాసంబులకునేగినారు వారు.                     67.
గీ.  దోషి నరసింహరెడ్డిగాఁ దోచి యతనిఁ
బట్ట యత్నంబుఁ జేసిరి గట్టిగాను,
పట్టుబడు రెడ్డి యన్నచో నుట్టిమాట,
యతఁడు సామాన్యుఁడా? కాడు క్షితిజ నృహరి.             68.
1846 జూలై 23 న నొస్సం కోటపై బ్రిటిష సైన్యం దాడి.
.   పంపెను గూఢచారులను, పంపెను సేనల నట్టివేళ భూ
కంపము వచ్చినట్టులుగ  కాల్బలమాపని చేయ నేగె,  సా
ధింపఁగ బూనిరాజ్ఞల నధీశ్వరుఁ డిచ్చిన తీరు నెన్నుచున్,
బంపుటఁ జేయఁ గల్గినను బట్టుట యన్ననదంత సాధ్యమా?     69.
.  కోటను ముట్టడించుట కకుంఠితరీతిని నొస్సమేగగా
దీటగు సైన్యమున్ గొనుచు తీరుగ వాట్సను సిద్ధమై చనెన్,
వేటకు పోవువారలకు వెఱ్ఱిగ దాహము వేయునట్టుల
చ్చోట దగన్ జలంబులకుఁ జూచిరి వారలు, కానరా వహో!    70.
.  ధైర్యము చెప్పఁజూచి యట దారిని వాట్సను సైనికాళికిన్
గార్యము చేయఁ బూనితిమి, ఖడ్గములారిపు వర్గ రక్తమున్
శౌర్యమెలర్ప త్రాగునటు చక్కగ చేసినఁ, దీరు దాహమే,
శౌర్యము మీదు సొత్తు, గుణసన్నుత సైనికులార! యంచనెన్.   71.
.  దాహము తీరునా యభినుతంబగు వాట్సను మాటలన్ వినన్?
సాహస వీరులే యగుత, సాధ్యమెటుల్ దగ తీరకుండినన్
దేహము నిల్పుకోఁ దగిన తీరు కనంబడదే రహింపఁగన్,
మోహ విదూరులౌచు చనిపోవుటతప్ప,  విధిప్రభావమే.       72.
.  నీరములుండు తావులు గణించుచు మట్టిని కప్పివేసె నా
ధీర నృసింహరెడ్డి, తనదేకద జ్ఞాన సమృద్ధి యన్న, నా
వీరుని చేత నోటమియుఁ బ్రీతియె నాకని యెంచె వాట్సనే,
కోరుచు మృత్యువున్ గొనెడి కోర్కెయు పండునొ? పండకుండునో?  73.
.  చేరుచునుండ వాట్సను, సచేతనుఁడై నరసింహరెడ్డియున్
జేరెడివారిపైనఁ బడఁ జేసె ఫిరంగుల గుండ్ల వర్షమున్,
ధీరులు కొందరా యనిని తీవ్రముగా యెదిరించి నిల్చియున్
పోరు భయంకరంబగుటఁ బోయిరి మృత్యువు నాశ్రయించుచున్,    74.
శా.  ఉద్వేగంబున ముందుగా నడచి యుద్ధోన్మాదులౌ  కొంద రా
పద్వారమ్మగు గుంతలందుఁ బడి రేపాపంబులన్ జేసిరో?
యధ్వానంబగు నాంగ్లపాలనమునన్  హాయన్నదే లేక, యు
ద్ధధ్వాంతమ్మునఁ గొట్టుకొంచు బ్రతుకుల్ ధ్వంసంబుగాన్ జచ్చిరే. 75.
.  బిలబిల నాంగ్లసైనికులు వీరులవోలె పురోగమించగా
సలసల కాగు తైలమును చక్కఁగఁ జూచుచుఁ బోయ వారిపై,
జలజలరాలిపోయిరట చర్మము కాలినవారలందరున్,
వెలవెలఁబోయిరంద రట వింతగు నీపరిణామమెన్నుచున్.      76.
నరసింహారెడ్డి వాట్సనును వెంబడించి దండింపఁ బూనుట.
.  తొలిదగు యుద్ధమందు వినుతుల్ గొను శ్రీనరసింహరెడ్డినే
గెలుచు టసాధ్యమంచు పరికించుచు, పర్విడినారు శత్రువుల్,
సులభము కాదు గెల్పనుచుఁ జూచుచు వాట్సను పర్వుతీయుచున్
బలుమరు చూచె వెన్కకును, వచ్చుచునుండెనొ రెడ్డి? యంచు తాన్. 77.
.  సైనికపాళి కొందరటు సాగిరి వాట్సనుతోడ, గిద్దలూర్
సేనలు చేరు లోపలనె చేరె నృసింహుఁడు సైనికాళితోన్,
దీనత నాంగ్ల సైన్యము వధింపఁబడెన్ రిపుపాళి చేతిలోన్,
బ్రాణములొడ్డ తప్పదుగ భండనమందున నెట్టివారికిన్.      78.
.  నరసింహుని సైనికులును
మరణించిరి యుద్ధమున ప్రమాద వశమునన్,
గరుణకు తావే యుండదు
నిరుపమముగ నొప్పు ధర్మ నిష్ఠుల యనిలోన్.           79.
.  పరుగిడుచున్న వాట్సనును పట్టెను రెడ్డి, దురాత్మకుండ! యెం  
దరిగెద వీవు? నన్ దునుమ నాశగవచ్చిన నిన్ను వీడ, నా
కరమున నున్న ఖడ్గమున కంఠముఁ ద్రుంచెద నీకటంచు సు
స్థిరమగు నిర్ణయంబున వధింపగ నాతని, నెత్తె ఖడ్గమున్.     80.
.  బలమగు ఖడ్గఘాతమది, వంగగ వాట్సను ముప్పు తప్పె, దు
ర్బలుఁడయి పర్వు తీసె తనవాహనమైన తురంగమెక్కి, యా
ఖలుని వధింపఁ బోవు తరి గాఢతరంబగునట్టి శబ్ద మా
వల వినిపించ రెడ్డి యటుప్రక్కకు చూచె నదేమిటంచు తాన్.   81.
గీ.  చేరె వాట్స నా సైన్యమున్ సెట్టివీడు, 
ముండ్లపాడుకున్ జేరెను పూజ్యుఁడయిన 
రెడ్డి తనసైన్యమున్ గొని, గడ్డుకాల
మందు దాగియుండుటె తగుననుచుఁ దలచి.              82.
గీ.  నాట్టు, రసెలులన్ కెప్టెన్లు నవ్యరీతి
సైన్యమును గొని మరునాడు గణ్యముగను
ముండ్లపాడున కేగిరి, పోరు సలిపి,
రెడ్డినే బట్టుకొనుటకై ప్రీతితోడ.                        83.
రెడ్డి కంబం తహసీల్దార్ జంగంరెడ్డి శ్రీనివాసరావును నరుకుట.
ద్రకము. (భ ర న ర స స న గ.  యతి 11. )       
ఘోరపు యుద్ధమే జరిగె,  సంకులంబగు యుద్ధమునం దిరు తెగల్   
తీరని నష్టమున్ గనుట నార్తినేఫలితంబుగ నందిరి, మహో
ద్ధారకుఁడైన యా నృహరి యుత్తరించెను ఖడ్గముతోడ తహసీ
ల్దారు శిరంబునే,  యతఁడు నేత,  కంబము నేలెడి  శ్రీననుచు తాన్ . 84.  
.  కరమునఁ గల రక్త ఖడ్గంబుఁ గొనిపోయి
యల జగత్పతి గుడి వెలుపలున్న
కత్తులన్ని కడుగు నెత్తురుకుంటలో
కడిగినాడు రెడ్డి వడిగనపుడు.                            85.
.  ఆలయంబు వెనుక నలరారు చున్నట్టి
పాలకుంట జలము గ్రోలి రెడ్డి
దన్నునిల్పు శ్రీ జగన్నాథు దర్శించి
ప్రార్థనంబు చేసె భక్తితోడ.                            86.
.  మే మొనరించినట్టి యుపమింపఁగ రాని రణంబునందునే
యేమరుపాటు లేక వధియించితి మిప్పు డవారితంబుగాఁ
దాము ప్రతిక్రియన్ జరుపఁ దప్పక వచ్చెద రాంగ్ల పాలకుల్,
హే మహిమాన్వితా! కనికరించి యుపాయము నెన్నఁ జేయుమా!  87.
.  అనుచు వేడుచుండ నచటికి గోసాయి
వచ్చి పిలిచినట్లు,  పరవశించి
విజయ గర్వమునను విర్రవీఁగఁగ రాదు
పొంచియుండె ముప్పు కాంచుమనెను.                  88.
.  వినె గోసాయి యొసంగు సూచనలు, భావిన్ జూపు దేవుండ వో
మునిమాన్యా! తమరన్నటుల్ జరిగెడున్, బోధించుఁడీ మార్గమున్,
వినుదున్, మీ దగు మార్గమున్ నడతు నేన్, విజ్ఞాన సంపన్నిధీ!
యనుచున్ రెడ్డి వచించె తద్గురునితో నానందమొప్పారఁగాన్.   89.
.  వచ్చె నపుడె యటకు వడ్డె యోబన్నయు
చెప్పె నాంగ్ల సైన్య మప్పుడె మన
కొఱకు వెదకుచుండ్రి, ఘోరంబుగా మనన్
బట్టి చంపనెంచి పట్టుపట్టి.                           90.
.  విని యోబన్న వచించినట్టి పలుకుల్, వేగంబె యోచించి  యా
వనదుర్గంబున కేగుటొప్పుననుచున్ వాక్రుచ్చె వేంకన్న, త
ద్వనదుర్గంబును కట్టె నల్లమల ప్రాంతంబందు మీ తాతయే,
మన మాచోటికి వెళ్ళుటుత్తమము సమ్మాన్యా! నృసింహా! త్వరన్.  91.
శా.  ఆ మాటల్ నరసింహరెడ్డి విని చింతాక్రాంతుఁడై దీనతన్
బ్రేమన్ జీవన మార్గమందు ప్రజలన్ విఖ్యాతిగాఁ బ్రోచుచున్
ధీమంతుల్ భరతావనిన్ వెలుగఁగా దేదీప్యమానంబుగా 
క్షేమంబొప్పఁగ నుండ కుండ మనకీ శిక్షేల ప్రాప్తించెనో?     92.
.  ఇష్టముతోఁ గట్టించితి
కష్టంబును లెక్కఁ గొనక, ఘనమగు కోటన్
స్పష్టంబుగ నొస్సామున,
నష్టంబగుచుండె నేడు నా మది క్రుంగన్.                93.
గీ.  అనుచు నందున్న తనవారి నంపివేసె
క్రొత్తకోటలో నుండుటే యుత్తమమని,
తాను తనసైన్యమును కూడి తరలిపోయి
చేరె వనదుర్గమును నరసింహరెడ్డి.                      94.
శా.  ఆ మాన్యుండు జయింప నాంగ్లులను తా నా ప్రాంతమందుండె, సు
క్షేమంబున్ దన మిత్రపాళి కనగాఁ జిత్తంబునందెంచుచున్,
ధీమంతుల్ తమ స్వార్థమున్ మరచి ధాత్రిన్ మిత్రులున్ బేదవా
రేమాత్రంబును బాధలం గనక శోభింపంగ వాంఛింతురే.       95.
.  కానన మేలునట్టి యధికారిగ పీటరు దుర్మదాంధుఁ డా
కానలలోన వంటకని కట్టెల కేగెడి పేదవారలన్
హీనపు దృష్టితోఁ గనుచు, హేయపుమాటలతోడ తిట్టుచున్,
జ్ఞానవిహీన వాగ్ఝరిని, కష్టము కొల్పుచు వేచు పాపియై.    96.
గీ.  పల్లె రుద్రవర మడవి ప్రక్కనుండె
ప్రజలు వంటకై కట్టెలన్ బడయు చోటు,
పీటరధికారిగా వచ్చి వీరినఁటకు
రావలదటంచు శాసించె,  రాక్షసుండు.               97.
.  పీటరు పెట్టెడి యాంక్షలు
దాటగ శక్యంబు కాగ, తల్లడపడుచున్
నోటికి తిండియె కరువయి,
పాటులు పడుచుండి రకట, ప్రజలాపల్లెన్.             98.
గీ.  అచటివారిని గాంచిన యానృసింహుఁ
డడిగె మీరిట్టులుండి రాహార లోప
ముండెనా? యన, తిండికి నుండె దినుసు,
వంటకట్టెలే లేవని పలికిరపుడు.                    99.
.  జంగమ మల్లయ చెప్పెను 
సంగతి మొత్తము నృసింహ సహృదయమణికిన్,
బెంగను తీర్చగ వచ్చిన
బంగారపు కడ్డిమీరు పావన చరితా!               100.
గీ.  పీటరధికారి యడవికి, వీఁడు మమ్ము
వంటకట్టెలన్ గొనిపోవ వలదటంచు
నాంక్షలను బెట్టి వేధించునయ్య, యేమి
చేయఁగలమయ్య వానిని ? చెప్పుడయ్య!         101.
.  పొరపడి యెవ్వరైన నటుపోయిన వారినిఁ బట్టి కొట్టు, దు
స్తరమగు హింసఁ బెట్టుచును, చంపుచు పృథ్విని పాతిపెట్టు, నా
దరికిని మేతమేపుటకుఁ దా పసరంబుల తోడనేగినన్
గరువముతోడ గైకొనును కాపును చంపి, దొరా! దురుద్ధతిన్.     102.
.  స్త్రీ లటు వంటకట్టెలకుఁ జేరిన యంతనె చూచి వారలన్
బాలికలంచు, వారు పరభామలటంచును నెంచఁబోడు, దు
శ్శీలుఁడు, వారలన్ జెరచు,  చేతికి వచ్చినయట్లు కొట్టుచున్,
గాలికొలంది తన్నుఁ, గొరగాములు చేయుచు బాధపెట్టునే.     103.
గీ.  పంటలున్నవి, గింజలు పండెమాకు,
వంటకట్టెలు లేక మేముంటిమయ్య
తిండి తిప్పలు లేక యీ పండుముసలి
వారు, బాలురున్ బోదు రే దారి లేక.                   104.
నరసింహారెడ్డి అటవీ అధికారి పీటర్ ను సంహరించుట.
శా.  ఆ మాటల్ విని, నర్సరెడ్డి మదిలో నాక్రోశమున్ బొంది, మీ
క్షేమంబున్ గనువాఁడ, రండనుచు, దుశ్శీలున్ వధింపంగ, తా
నేమాత్రంబును జాగుచేయ కరిగెన్, హీనుండు పీటర్ వనిన్
కాముండై పరకాంతతో గడుపుచున్ గానంబడెన్ రెడ్డికిన్.        105.
గీ.  ఎదుట నిలిచిన రెడ్డి నిదేమి?  యెవరు
నీవు? నాకడ కేతెంచినా వదేల?
ననగ నరసింహుఁ డనియె, గర్వాంధ! నిన్ను
చంపవచ్చిన యముఁడను,  చత్తువిపుడె.              106.
.  రెడ్డిని మాయ చేసి, బెదిరించు తెరంగునఁ జేరి, పారగా
నడ్డుచు పీటరాఖ్యుని, మదాంధుఁడ! యెందులకేగఁ గల్గు దీ
రెడ్డి కృపాణధాటి కని పృథ్విని వీడక ముందె? యంచు పైఁ
బడ్డ నృసింహమ ట్లతనిపైఁ బడి ఖండనఁ జేసె  శీర్షమున్.     107.
.  జనులా దృశ్యము చూచి పొంగి, పరమేశా! మాకు  నీవే యిటుల్
ఘనుఁడౌ శ్రీ నరసింహ నామముననే కాపాడఁగా వచ్చితే? 
వినయంబొప్పఁగ నీకు మ్రొక్కెదమయా! విశ్వాసమొప్పారఁగా,
ఘనతన్ వెల్గెడి నీవె మా ప్రభువువై కాపాడు మమ్మందరిన్.    108.
.  అనుచు ప్రశంసచేసి, పరిహారము చేసితివయ్య కష్టముల్,
ఘనుఁడగు నారసింహ! నినుఁ గాదని పోవగలేము, నీకు మే
మనయము వెంటనుండెద మహంబును వీడుచు సైన్యమై ధరన్,
వినతి గ్రహింపుమంచతని వేడిరి యా ప్రజ భక్తినొప్పుచున్.     109.   
.  కంబము, చుట్టుప్రక్కఁ గల గ్రామములం గల వారలెల్లరున్
సంబరముల్ మహోద్ధతిని జక్కగఁ జేసిరి, పీటరంతమే
యంబరమంటు సంబరము హాయి నొసంగ నృసింహరెడ్డియే
సాంబుఁడటంచు మెచ్చి, విలసన్నుత రీతి సుఖాబ్ధిఁ దేలిరే.     110.
.  ఘనదావానలమట్లు వ్యాప్తమగుచున్ గంపింపఁగాఁ జేసె నీ
వనిలోఁ బీటరు హత్యవార్త ప్రభులన్, పట్టంగ నా రెడ్డి నీ
వని కెవ్వారును రారు సాహసముతో, వాని ప్రభావంబు దు
ర్జన కారాడవిలోన చిచ్చనుచు నాశన్ గల్గి ప్రాణంబులన్.     111.
.  దురహంకారముతోడనున్న దురితుల్ దుర్మార్గులౌ పాలకుల్
స్థిరమై భారత దేశమేలవలెనన్ దీపించు నాకాంక్షకున్
జరమాంకంబును జూపినట్టి ఘటనల్ జాజ్వల్యమానంబుగా
వరలం జొచ్చె నృసింహరెడ్డి యసిలోన్,  వారింపనెవ్వారికౌన్? 112.
.  భయము జనించె, పాలకుల భద్రతకే యిల దిక్కులేక, సం
శయముగ నుండె యున్కికిని, సాగవు మాదు కుయుక్తులింకపై,
జయమిక కల్ల మాకు, గుణసాంద్రుఁడు శ్రీ నరసింహరెడ్డియే
భయముగ మారె మాకనుచు పాలకవర్గము క్రుంగఁ జొచ్చెనే.  113.
గీ.  రహిని కాక్రేను, నార్టను, రసెలు, డాని
యలును, జోసప్ఫులొకచోట,  కలుసుకొనిరి,
మంతనంబులు జరిపి రవ్వంతయైన
ననుసరించెడి మార్గంబునమలు చేయ.                 114.
.  పాలకులందరేకమయి పట్టవలెన్ నరసింహునంచు,   వే
యేల నృసింహరెడ్డి నిల నెవ్వడు పట్టి యొసంగ నేర్చునో
మేలుగ నైదువేలతని మేలును గోరి యొసంగ నుంటిమం
చాలము వీడి యో ప్రకటనందరికిన్ దెలియంగఁ జేయనౌన్.    115.
.  అంతయె కాదు రెడ్డినిల నంతము చేసిన వారికింతకో
యింత ధనంబుఁ జేర్చి గణియించుచు నిచ్చెదమంచుఁ దెల్పినన్
సుంత ధనంబుపైఁ గలుగుచుండిన కోర్కెను వీడలేక తా
పంతము పట్టి రెడ్డినిల పట్టియొసంగక యుందురే ప్రజల్?     116.
.  అనఁగనె కాక్రేన్ ప్రకటన
వినుడని ప్రజ కెఱుకపరచ,  విని ప్రజలొకటై
ధనమున కాశింపక, తా
వినయముతోఁ దెలియదనిరి, వినిన ప్రజలఁటన్.           117.
.  ప్రజలు నృసింహరెడ్డిపయి భక్తిని కల్గినవారటంచు, నా
ప్రజలకు రెడ్డి నేతయని, వద్దనుకొన్నను వానితోడనే
ప్రజలు మెలంగఁ జూతురని బాగుగ నమ్మిన యాంగ్లపాలకుల్
ప్రజలకు భీతిఁ గొల్పుటకవారిత యత్నము చేయుచుండిరే.  118. 
ఆశ్వాసాంతము.
త్సాహ.  జయము జయము శ్రీనృసింహ జయమునీకు నెప్పుడున్,
భయముఁ బాపి భక్తతతిని పాలనంబు చేయుమా,
ప్రియముతోడ నిన్నుఁ గొల్తు, విశ్వశాంతిఁ గొల్పుమా,
నయనిధాన!  నీవు సతము నామదిన్ వసింపుమా .         119.
కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట  పుత్రుఁడును,పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను చారిత్రక ప్రబంధమున తృతీయాశ్వాసము సమాప్తము.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.