గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఫిబ్రవరి 2020, మంగళవారం

జపం, జపమాలలు ఎన్నిరకాలు? .. .. .. బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ..

జైశ్రీరామ్.
జపం, జపమాలలు ఎన్నిరకాలు? బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ..
వాటి ఫలితాలు ఏమిటి?
జకారో జన్మ విచ్చేద:
పకారో పాపనాశక:
జన్మపాప వినాశిత్వాత్
జప ఇత్యభిదీయతే
జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘;పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశము. అందుచేతనే భగవద్గీతలో శ్రీక్ర్ష్ణపరమాత్మ అర్జునినితో, ‘యజ్ణ్జానాం జప యజ్ణ్జోస్మీ అని చెప్పడం జరిగింది. అంటె, యజ్ణ్జాలన్నింటిలో నేను జపయజ్ణ్జాన్ని! అని చెప్పాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సాధారణంగా జపం మూడు విధాలుగా ఉంటుంది.
1. వాచింకం: మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.
2. ఉపాంశువు: తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.
3. మానసికం: మనస్సులోనే మంత్రాన్ని జపించడం.
వాచిక జపం కంటె ఉపాంశు జపం వంద రెట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం వెయ్యిరెట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడ చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్టదేవతాపుజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదనేది శాస్త్రం. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.
జపమాలలు మూడు రకాలు.
1. కరమాల: అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలము వరకు గల పది కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లువుతుంది.
2. అక్షమాల: ‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా ’క్షా కల్మషాలను తోలిగిస్తుంది.
3. మణిమాలలు: రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.
రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాలజపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటిగుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపుమాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసిమాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.
అన్ని యజ్ఞాలకన్నా జపయజ్ఞం గొప్పదని మనుస్మృతి చెబుతోంది. తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్రపరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.
త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా
తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే
అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠవ్రేళ్ళపై ఉంచి, చేతి బోటనివేలితో, మధ్యవేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురుకర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ణ్జానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మరల దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచిపెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్ , సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.
దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.
గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీదగాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జపసంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. చివరగా, కర్మలు, యజ్ఞాలు, వ్రతాలు, దానాలు, తపస్సులు ఎన్ని చేసినప్పటికి జపానికి సరికావన్నది పెద్దల వాక్కు. అందుకనే జపాన్ని ఒక యోగం అన్న మన పెద్దలు, దానికి పెద్దపీటను వేసారు.
 స్వస్తి.
చొప్పకట్ల సత్యనారాయణ.
శ్రీమా చొప్పకట్ల సత్యనారాయణ గారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు చెప్పారు...

ఆధ్యాత్మికమార్గంలో నడిచేవారికి ఇదో గురుపీఠంలా..
గురుదేవులుపలికిన అమూల్యమైన బోధనామృత వర్షంలావుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.