గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, అక్టోబర్ 2016, బుధవారం

హిందూమత వివరణము . . . ప్రవీణ్.

జైశ్రీరామ్.
హిందూమత వివరణము . . . ప్రవీణ్..
మీ మతమేది..? అని ప్రశ్నిస్తే "హిందూ మతం " అని సమాధానం చెప్తాము. అలా చెప్పటం తప్పుకాదు కానీ దాన్ని గూర్చి తెలిసికొనవలసినది చాలా ఉంది. నిజానికి "హిదూ " అనేది మతం కాదు. మతంగా పుట్టలేదు.క్రమపరిణామంలో మతంగా స్వీకరింపబడింది.
మనది "హిందూ ధర్మం ". ధర్మానికి,మతానికి చాలా తేడా ఉంది.ధర్మం అంటే "ధరతి విశ్వమితి ధర్మ:" అని ప్రపంచాన్ని ధరించేది ధర్మం." ధారణాద్ధర్మమిత్యాహు:"అని చెప్పబడినది. అంటే ఆధారమైనది. 'దేనికి..?' అంటే సమస్తమునకూ ఆధారమైనది ధర్మం. ఈ ధర్మం ఉంటేనే సమస్త ప్రపంచమూ నిలబడిఉంటుంది. ధర్మం నశిస్తే ఆధారంలేనిది పడిపోవడం సహజం కాబట్టి ప్రపంచమంతా పతనమవుతుంది.
ధర్మం అంటే:
"దృఞ్ ధారణే " అను ధాతువునుండి ధర్మశబ్దం పుట్టింది."ధారణాద్ధర్మమిత్యాహు: - ధర్మో ధారయతే ప్రజా: '; యత్స్యాద్ధారణ సంయుక్త: - సధర్మమితి నిశ్చయ: " అని ధరించేది ధర్మం. ప్రజలను ధరించునది కాబట్టి ధర్మమని చెప్పబడింది. ఈ ధర్మానికి పది లక్షణాలు ఉన్నవి "ధృతి: క్షమా దమో స్తేయం - శౌచ మింద్రియనిగ్రహ: - ధీ ర్విద్యా సత్యమక్రోధ: - దశకం ధర్మలక్షణం." అని వేదాలను ప్రమాణంగా అంగీకరించడం,సంప్రదాయబద్దంగా వచ్చే విభిన్న సాధనా మార్గాలను అనుసరించడం,ఉపాసనీయ దేవీ దేవతలయందు భక్తి కలిగియుండడం హిందూధర్మ లక్షణాలుగా లోకమాన్య తిలక్ కూడా చెప్పారు. ఇలాంటి నిర్వచనాలన్నీ కలసికూడా హిందూధర్మానికి సమగ్ర నిర్వచనం కావు. అంతటి మహోన్నతమైనది హిందూధర్మం.
ఆధారమైన ధర్మం నశిస్తే జరిగేది పతనం. ధర్మం అన్నిచోట్లా ఉండవలసినది.మనుష్యునిలో మనుష్యధర్మం ఉంటే వాడు మనుష్యుడనిపించుకుంటాడు.వాడు ధర్మం తప్పితే పతనమైపోతాడు.అలా స్త్రీ, పురుష, పితృ,మాతృ,సోదర... ధర్మాలు చాలా ఉంటాయి.వారిలో ఆ దర్మాలు ఉన్నంతవరకే అలా గౌరవించబడతారు.ఆ ధర్మాలు నశిస్తే వారు పతనమైనట్లే.అలా ప్రపంచమంతటికీ భగవద్దత్తమైన ఒకే ఒక్క ధర్మం హిందూ ధర్మం. ఆద్యంతాలు లేనిది కాబట్టే దీనిని "సనాతనధర్మం " అంటాము.(సనా - సదా భవతీతి సనాతన:) ఋషిసత్తములు అందించిన ధర్మం కాబట్టి దీనిని "ఆర్షధర్మం" అన్నారు.భారతదేశంలో ఉన్నందున దీనిని "భారతీయధర్మం"అనేవారకూడా ఉన్నారు. ఎన్నిపేర్లు ఉన్నా దీని ప్రధాననామం "హిందూధర్మం".
సృష్టిలో చరాచరమగు ప్రతి అంశానికీ ఒక ధర్మం ఉంటుంది.ఆ ధర్మం ఉంటేనే అది అదిగా చెప్పబడుతుంది."ఏ నేదం ధార్యతే స ధర్మ:" ఒకటి దేనివలన ధరింపబడుతుందో అది దాని ధర్మం. ప్రపంచమంతా ధర్మమునందే నిలిచిఉన్నది కాబట్టే "ధర్మే సర్వం ప్రతిష్ఠితం" అని చెప్పబడింది."ధర్మో విశ్వస్య జగత: ప్రతిష్ఠా "అని సమస్త ప్రపంచాన్ని నిల్పగలిగినది ఈ ధర్మమే.ఈ ధర్మం పుట్టింది మన హిందూస్థాన్ లోనే...
వేదం "ధర్మం చర" అని ధర్మాన్ని ఆచరింపమని లోకాన్ని శాసిస్తోంది.అది కాదనరాని దైవశాసనం. "ధర్మాన్న ప్రమదితవ్యం " ధర్మంలో ఏమరపాటు తగదని."ధర్మమేవ హతోహంతి - ధర్మోరక్షతి రక్షిత:" ధర్మాన్ని నాశనంచేస్తే అది మనకే ప్రమాదమని తెలుపుతుంది.
"యతోభ్యుదయ నిశ్శ్రేయసస్సిద్ది: స ధర్మ:" అంటే ఇహపర సద్గతులనొసగేది ధర్మమని ధర్మప్రయోజనాన్ని కణాదుని వైశేషిక సిద్ధాంతం చెబుతోంది.అభ్యుదయం అనేది జీవితానంతరం స్వర్గంలోను, ఇతర జన్మ పరంపరలోను రాబోవు సుఖాన్ని తెలియజేస్తుంది. నిశ్రేయసం మోక్షానందాన్ని తెలియజేస్తుంది.
ఈ ధర్మాలు సాధారణ ధర్మాలు,విశేషధర్మాలు అని రెండువిధాలు.యజ్ఞ,దాన,తపస్సుల వంటివి సాధారణ ధర్మాలు.ఆపద్ధర్మాలు, ధర్మసూక్షమాలు వంటివి విశేష ధర్మాలు.
"అధ్యయనాత్ న చ పండిత: - ధర్మం చరతి పండిత:"దర్మాధ్యయనం వలన పండితుడు కాడు, ధర్మాచరణ చేయువాడే పండితుడు.
ఒకే విషయంలో భిన్నధర్మాలు కనబడితే పెద్దల ఆచరణలో ఏది నిలిచిందో అదే ధర్మ.ఫలితాంశంగా మానవులు దేనినాచరించటం వలన శ్రేయస్సు పొందుదురో, పాపం పొందకుందురో అది ధర్మం.
ధర్మార్థకామమోక్షా లనే చతుర్విధ పురుషార్థాలలో శ్రేష్ఠం ధర్మం. మిగిలిన మూడింటిని సాధించడానికి ఇదే మార్గం.
ధర్మం అనగా " విద్వద్భిస్సేవితం సద్భి: నిత్యమత్వేషరాగిభి: ; హృదయేనాభ్యనుజ్ఞాతో - యో ధర్మస్తం నిబోధత " అనగా రాగద్వేషాలకు అతీతులగు మహాజ్ఞానులచే ధర్మాన్ని అనుసరింపమని మనల్ని ఆదేశించారు.
"అనిత్యాని శరీరాణి-విభవో నైవ శాశ్వత: ; నిత్యం సన్నిహితో మృత్యు:-కర్తవ్యో ధర్మ సంగ్రహ:" అన్నారు పెద్దలు. శరీరం అశాశ్వతమైనది.సంపదలూ అశాశ్వతమైనవే.మృత్యుదేవత ఎల్లప్పుడూ ప్రక్కనే ఉంటుంది.కాబట్టి ధర్మరక్షణే మన కర్తవ్యం అని పై వాక్యానికి అర్థం.
అనేకంలో ఏకత్వాన్ని చూడగల సామర్థ్యం హిందూధర్మానికే ఉంది. ఈ ఏకత్వం కనబడక అనేకత్వం కనబడితే ఆ లోపం మనదే.ధర్మమే హిందువుయొక్క ఆత్మ.దీనిని బాగా అర్థంచేసుకోవాలి.భారతదేశ ఆత్మ ధర్మం కాబట్టే ధార్మికులైన హిందువులు తినడం, త్రాగటం, శయనించడం కూడా ధర్మబద్ధంగానే చేస్తారు.పుట్టినప్పటినుంచి మరణించేదాకా, సరిగా చెప్పాలంటే పుట్టుక ముందునుండీ చనిపోయాక కూడా ధర్మబద్దులయే ఉంటారు.ఈ విషయాలన్నీ అనంతబాగాల్లో చూస్తాము. పుట్టకముందు పుంసవన, సీమంతాది ధర్మకర్మలుంటాయి. చనిపోయాక అంత్యక్రియ,శ్రార్ధకర్మలు ఉంటాయి.అంటే హిందువుది పూర్తిగా ధర్మమయ జీవితం.ఆ ధర్మము తప్పితే హిందువు బ్రతికినా నిర్జీవుని లెక్క. కాబట్టి ప్రతి హిందువూ ధర్మమెరిగి ఆచరించాలి.
ఐహిక,పారమార్థిక ప్రయోజనాలు సాధించే ఈ ధర్మానికి నాలుగు లక్షణాలుంటాయి.1) వేద ప్రతిపాదితమై ఉండాలి.2)సంస్కృతిలో విశదీకరించబడి ఉండాలి.3)పెద్దల ఆచరణలో ఉండాలి.4)మనకు ప్రియమైనదికావాలి. వాటితోబాటు హిందూ ధర్మంలో ప్రధానాంశాలుగా దైవ విశ్వాసం, సదాచారం, శారీరక కర్మాధారమైన వర్ణధర్మం, మానసిక పరిణితి ఆధారంగా ఆశ్రమధర్మం, పాతివ్రత్యం, విగ్రహారాధన, యోగవిధి ; బ్రహ్మ - దేవ - పితృ - భూత - మానుష పంచయజ్ఞాలు; అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ పంచకోశ పవిత్రత ; శ్రుతి,స్మృతి, పురాణ, మంత్ర, తంత్రాది విశ్వాసం; కర్మసిద్ధాంత,పునర్జన్మసిద్ధాంత విశ్వాసాలు; నిర్గుణ, సగుణోపాసన; ముక్తి విశ్వాసాలు ఇమిడి ఉన్నాయి. ఈ ధర్మం విశ్వధర్మం.దీనిని రక్షించడమంటే విశ్వాన్నే రక్షించడమని అర్థం. అలాంటి ధర్మరక్షణకు బద్ధులం కావాలి.
ధర్మరక్షణ:
ధర్మాచరణే ధర్మరక్షణలో ప్రధానాంశం. అది ఏ వయస్సు మళ్ళినవారో మరేమి చేయలేరు కాబట్టి చేయవలసింది కాదు. "యువైవ ధర్మశీలస్స్యాత్ - అనిత్యం ఖలు జీవితం; కోహిజానాతి కస్యాద్య - మృత్యుకాలో భవిష్యతి" అన్నారు విజ్ఞులు. యువకులుగా ఉన్ననాడే ధర్మాచరణకు పూనుకోవాలి.ఎందుకంటే ఈ జీవితం అశాశ్వతమైనది. మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు.కావున వెంటనే ధర్మకార్యానికి పూనుకోవాలి. " ఏక ఏవ సుహృద్ధర్మో నిధనేప్యనుయాతి య:" చచ్చాక కూడా తోడుండే ఒకేఒక మిత్రుడు మనమాచరించిన ధర్మమే.ఒకప్పుడు ఈ ధర్మమే మనలను పాలించేది.ఆనాటి రీతి " న రాజ్యం న చ రాజాసీత్ - న దండ్యో న చ దాండిక: ; ధర్మేణైవ ప్రజాస్సర్వా: - రక్షంతిస్మ పరస్పరం" అని చెప్పబడినది. నాడు రాజ్యం లేదు, రాజులేడు, దండన లేదు, దండింపబడేవాడు లేడు. ప్రజలంతా ధర్మాన్ని ఆధారంచేసుకొని పరస్పర రక్షణలో ఉన్నారని దాని భావం. అలా అత్యున్నత స్థితి ఈ ధర్మంలో చవిచూచాము. మరల అట్టి ధార్మిక సమాజాన్ని ఆశిద్దాం. అందుకై కృషి మననుండే జరగాలి.
స్వస్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
హిందూమతమును గురించి చక్కని వివరణను తెలియ జేసారు శ్రీ ప్రవీణ్ గారికి , మాకందించిన శ్రీ చింతా వారికీ ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.