గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మే 2015, శనివారం

భస్మము, (విభూతి) ధారణ, ఆవశ్యకత.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నిరంతర ఆద్గ్యాత్మిక చింతనామృత పాన లోలురమైన మనము తెలుసుకొన వలసిన విషయములలో ఒకటి భస్మము, (విభూతి) ధారణ, ఆవశ్యకత.  కావున మనం ఇప్పుడు తెలుసుకొందాము.
విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు.
కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము.
మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలము లో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.
ఈ భస్మ ధారణ చేయడానికి శాస్త్రాలలో కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి.
బ్రాహ్మణ, క్షత్రీయులు "మానస్తోకే మంత్రము " తో, వైశ్యులు " త్ర్యయంబక " మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి.
ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.
మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని "శాంతికము " అని అంటారు.
షడాక్షరి మంత్రముతో హోమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు.
బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు..
భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.
యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచ్చిన అగ్నితో మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి.
అనంతరం శుభ్రమైన పాత్రలో విభుతిని నింపాలి.
హర హర మహా దేవ శంభో శంకర
సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః 
భవే భవే నాతిభవే భవస్వ మామ్|భవోద్భవాయ నమః 
వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ-
శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః
కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో
బలప్రమథనాయ నమ-స్సర్వ-భూతదమనాయ 
నమో మనోన్మనాయ నమః 
అఘోరేభ్యోஉథ ఘోరే”భ్యో ఘోరఘోరతరేభ్యః 
సర్వేభ్య-స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరోపేభ్యః 
త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్-మృత్యోర్-ముక్షీయ మాஉమృతాత్ 
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి 
తన్నో రుద్రః ప్రచోదయా”త్ 
ఓ౦ నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ 
మహాదేవాయ త్రయంబకాయ 
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ 
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ 
సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః 
ఓం శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే 
కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే
వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే 
యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే
విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే
సూశ్చమే ప్రసూశ్చమే సీరంచమే లయశ్చమ 
ఋతంచమే உమృతంచమేஉయక్ష్మంచమేஉనామయచ్చమే 
జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమేஉనమిత్రంచమేஉభయంచమే 
సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే| 
సదాశివోమ్ !
విభూతిని ఎందుకు ధరించాలి?
భస్మము అనే మాటకు "మన పాపాలను భస్మము చేసేది, భగవంతుడిని జ్ఞాపకము చేసేది" అని అర్ధము.  "భ" అంటే భస్మము చేయడాన్ని; "స్మ" స్మరణమును సూచిస్తున్నాయి.  అందువలన భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి, దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది.  భస్మము .. ధరించిన వారికి శోభనిస్తుంది గనుక "విభూతి" (శోభ) అనీ, దానిని పెట్టుకున్న వారిని పరిశుద్ద పరచి వారిని అనారోగ్యత, దుష్టతలనుండీ రక్షిస్తుంది గనుక రక్ష అని అంటాము.
హోమము (పవిత్రమైన మంత్రాలతో అగ్ని దేవుడికి సమర్పించే నివేదన) అహంకారము స్వార్ధ కామనలను జ్ఞానమనే అగ్నికి లేదా ఒక ఉన్నత నిస్స్వార్ధ కారణార్థమునకు ఆహుతిగా సమర్పించడానిని సూచిస్తుంది. తద్వారా వచ్చే భస్మము అటువంటి పనులు ఫలితంగా వచ్చే మానసిక పరిశుద్దతను సూచిస్తుంది.  నివేదనలను, సమిధలను అగ్నిలో దహింపజేయడమనేది జ్ఞానమనే అగ్నిలో అజ్ఞానము, సోమరి తనాన్ని వదిలించు కోవడాన్ని సూచిస్తుంది.  మనము ధరించే భస్మము, ఈ శరీరములో నున్న అసత్యపు తాదాత్మ్యత మరియు జనన మరణాల పరిమితుల నుంచి విడివడి స్వతంత్రుల మవ్వాలని సూచిస్తుంది.  శరీరము నశించేదని, ఒకనాడది బూడిదగా అవుతుందని కూడా మనకు భస్మ ధారణ గుర్తు చేస్తుంది.  అందువలన మనము దేహముపై మితిమీరిన మమకారం కలిగి ఉండకూడదు.  మరణమనేది ఏ క్షణానైనా రావచ్చు.  ఈ గ్రహింపు జీవితాన్ని ఉత్తమోత్తమముగా వినియోగించుకొని అభివృద్ధి మార్గాన పయనించే లాగున చేస్తుంది.  అంతేకాని మరణాన్ని గురించి జ్ఞాపకము చేసే దుఃఖ భరితమైనదని అపార్ధము చేసికో కూడదు.  కాలము ఎవరి కోసం నిలబడదని తెలియజేసే శక్తివంతమైన సూచిక ఈ భస్మము.
శరీరమంతటా భస్మాన్ని రాసుకోనేటటువంటి పరమ శివునితో ఈ భస్మము ప్రత్యేకమైన సంబంధము కలిగి ఉంది. శివ భక్తులు భస్మాన్ని త్రిపుండ్రాకారంలో ధరిస్తారు.  మధ్యలో ఎర్రని బొట్టుతో కలిపి పెట్టుకున్నప్పుడు ఆ గుర్తు శివ శక్తులను సూచిస్తుంది.
కట్టెలన్నీ(పదార్ధాలు) కాలిపోయిన తరువాత మిగిలేది బూడిద.  దానికి నాశనము లేదు.  అదే విధముగా లెక్కలేనన్ని నామ రూపాలతో కూడిన సృష్టి అంతా నశించినప్పుడు మిగిలి ఉండేది, నాశనము లేనటువంటి శాశ్వత సత్యము ఐన భగవంతుడు మాత్రమె.
"భస్మము" ఔషధగుణాలని కలిగి ఉంది.  ఇది ఎన్నో ఆయుర్వేద మందులలో వాడ బడుతుంది.  ఇది శరీరములోని అధిక శీతలతను పీల్చుకొంటుంది.  జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది .  భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పాలని ఉపనిషత్తులు చెపుతున్నాయి .
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్
మనల్ని పోషించేటటువంటి, మన జీవితాలలో పరిమళాలను వ్యాపింప చేసేటటువంటి త్రినేత్రధారుడైన శివుడిని పూజిద్దాము.  అతడు మనల్ని దుఃఖము మరియు మరణాల సంకెళ్ళనుండి పండిన దోసకాయ తోడిమ నుండి విడిపోయే టంత సులభంగా విడిపించును గాక.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
భస్మ ధారణ గురించి , విభూది యొక్క విశిష్టతను గురించీ , మృత్యుంజ మంత్రము యొక్క వైభవమును గురించీ చక్కగా వివరించి నందులకు శ్రీ చింతావారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.