గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2012, గురువారం

మా మంచి మాష్టారు. రచన: శ్రీమతి తటవర్తి జ్ఞాన ప్రసూనగారు

జైశ్రీరామ్.
ఆర్యులారా! నమస్సులు.
"మా మంచి మాష్టారు" అనే అంశంపై శ్రీమతి తటవర్తి జ్ఞాన ప్రసూన గారి అభిప్రాయం చూడండి.
ఆర్యులారా!
అన్నిటికన్నా మిన్న ఆచార్యుడు ,గురువు, ఉపాధ్యాయుడు,  పంతులు,  అయ్యవారు ఒజ్జ   ఇలా ఎన్నెన్నో పేర్లతో పిలువబడే గురువు .  ప్రతి వారి జీవితంతోనూ ముడిపడి ఉంటాడు. ఆయన వేష భాషలు  ,నడక విద్యార్ధి    మనస్సులో చెరగని ముద్ర వేస్తాయి.   కీ శే    చిర్రావూరి    సుబ్రహ్మణ్యం గారు మాకు హిందీ చెప్పేవారు.ఏలూరు రోడ్డులో  వుండే దక్షిణ భారత హిందీ ప్రచార సభలో    విశారద, ప్రవీణ చదువుకొన్నాము. తూరుపురేకలు
ఆరక ముందే  తయారయి పుస్తకాలు మోసుకు వెళ్ళేవాళ్ళం.  మా గురువుగారు   ఎర్రగా    ,పొట్టిగా,   ఒత్తరిగా వుండేవారు. బ్రహ్మ చారి,  మితభాషి . ప్రచార సభ లోనే   ఆయన   ఒక గదిలో వుండేవారు.  చిన్న కుంపటి మీద కాఫీ కాచుకొని తాగి   క్లాసుకు వచ్చేవారు.  అన్నిపనులు స్వయంగా  చేసుకొనే వారు. ఎప్పుడూ ఒక పొల్లు మాట   ఆయన నోటి వెంట మేము వినలేదు.  విద్యార్ధుల వెంట గుర్రుగా  చూడటం,  ఏదన్న అడిగితే విసుక్కోవడం  అలాటి లక్షణాలేవీ లేవు.స్థిత ప్రజ్నులై    ప్రసన్న వదనంతో    "ఎవరేమి అడుగుతారా?  చెపుదాము."అని ఆశిస్తూ వుండేవారు. ఆయన పాఠం వింటే అరటి పండు ఒలిచి చేతులో పెట్టినట్లు వుండేది. విద్యార్ధుల్ని  చాలా ప్రోత్సహించేవారు. ఒక విషయం  చెప్పినపుడు దానికి సంబంధించిన  పుస్తకాలు,పాఠ్య ప్రణాళికలో లేనివి   మమ్మల్ని చదవ మని   ఆదేశించేవారు.  అప్పుడు మేము నాటక లక్షణాల గురించి చదివాము. ఒకసారి ఇలాగే    ఫలానా పుస్తకాలు చదవండి  అని ఆదేశించారు.  లైబ్రరీలో తెచ్చుకు చదివాము.  క్లాసు మొదలవగానే  "హటాత్తుగా ఫలానా వారు, ఫలానా   పుస్తకం గురించి   వివరిస్తారు అనేవారు.  ముందు తయారు కాకుండా   అలా క్లాసులో చెప్పాలంటే నోరెండిపోయి, గొంతు పెగిలేది కాదు. "ఫరవా లేదు   ఎంత తెలిస్తే   అంటే చెప్పండి ."మెల్లగా హెచ్చరించేవారు. అప్పటినుంచీ మేము ఏపుస్తకం చదివినా   దాని సారాంశ ము  బుర్రలో ఒక పక్క తయారుగా పెట్టుకొనే వాళ్లము. చదువు పూర్తి అయి బయటికి వచ్చాక కూడా   గురువుగారిని కలుసుకొంటు వుండేవాళ్ళము. "ఏమి చేస్తున్నారు?   ఏదో ఒకటి చెయ్యండి.సొంత రచనలో, అనువాదాలో   చేస్తూ వుండండి, కాలం వృధా చెయ్యొద్దు.  "అనిచెప్పి వారు కొత్తగా చేసిన రచనలుంటే చదవమని ఇచ్చేవారు. పూజ్యులు  ఉషశ్రీ గారు ఆయన ప్రాణ స్నేహితులు.  వీరిద్దరికీ   శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి రచనలు, ముఖ్యంగా శ్రీ    రామాయణ కల్ప వృక్షం అంటే ఎంతో ఇష్టం.  ఇద్దరు కలిసి రోజుల తరబడి   చర్చలు చేసేవారు. కొట్టి,తిట్టి , మొహం చించుకొని, గావు కేకలు పెట్టి, చీత్కారం చేసి, నువ్వు ఎందుకూ పనికి రాని ---వ్విరా! నీకు బుర్రలో ఉన్నదంతా మట్టె, అని  జీవితం అంటే విరక్తి పుట్టేలా  శాపాలు పెట్టడం  గురుత్వ లక్షణం కాదు. తను నియమ పాలన చేస్తూ, మౌనంగా ఆదేశిస్తూ, సక్రమ  మార్గం లో ముందడుగు వేస్తూ, భక్తి, గౌరవ ప్రపత్తులతో శిష్య పరమాణు వులని తన వెనక నడిపిమ్పగాలవాడే    గురువు. మంచి గురువు దొరకడం మహద్భాగ్యం.  
చూచారు కదండీ శ్రీమతి జ్ఞాన ప్రసూనగారి మా మంచి ఉపాధ్యాయులను.
సరే మీరు కూడా మీకుస్ఫూర్తిప్రదాతయైన గురువును గూర్చి వ్రాసి పంపండి.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.