గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జూన్ 2009, సోమవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 20 & 21

క:-
ఆవిష్కృత్యబిముఖ నవ
భావజ సుమనో మనోజ్ఞబంధుర హేలా
జీవన వసంత వేళా
యౌవతమును బోలు కాననాంతర వల్లుల్. (వి. ర. క.వృ. కి. నూ. 20)

శ్రీరాముని
దృష్టి కాననాంతర వల్లుల పై ప్రసరించినది. ఆ అడవి యందలి పూల తీగలు ఎట్లున్నవి? యువతీ సమూహము వలె ఉన్నవట. ఆ తీగల యందలి పువ్వులు తమ యందు పుట్టు చున్న మన్మధ భావములను తెలుపుచున్న హేలల వలె ఉన్నవట.

శృంగార భావోద్దీప్తుడైన రాముని యందు సీతా స్పృహ నిర్నిమిత్తముగానే కలుగు చున్నది. పూల తీగలు అంగమైన యువతుల వలె కనిపింపగా పూవులు బాల్య యౌవన దశాంతర పరిణాహములైన ఆ యువతుల హేలా విలాసములుగా భావించుట రమ్యతరమైన కల్పన. యౌవనమును జీవన వసంత వేళగా విశ్వనాధ రూపించినాడు. హేల యనునది ఒక శృంగార చేష్ట. బాల్య యౌవన దశల సంధి యందు పుట్టిన అంతః కరణ వికారమును వ్యక్తమును చేయు చేష్ట అని ఆలంకారికుల నిర్వచనము.

ఇట్లు సీతా సంబంధమైన ఊహ చేసిన మరు క్షణమే శ్రీరాముడు " సీత జీవించి ఉన్నదా? జీవించి యుండుట నా భ్రాంతియా?" అని వితర్కించుకొనును. ఎందువల్లననగా శ్రీరాముని మన్మధ స్పృహకు ఆలంబనము సీత. ఆమె లేనిచో ఇక స్పృహ ఎక్కడిది? నాయికా నాయకులు వ్యవస్తితులై ఉన్నప్పుడే రస నిర్వహణ కదా!

ఇక్కడ కవి చాల గడుసుగా విప్రలంభ శ్రుంగార రసనిర్వహణ చేయుచున్నాడు. ప్రతి భావమును ప్రతిభావంతముగా తీర్చి దిద్దిన కవి విశ్వనాధ.

సీత జీవించి యున్నదో? లేదో? అన్న వితర్కము రాముని మనస్సులో ఉద్భవించిన మరుక్షణము ఆయన వ్యాకుల హృదయముఇట్లు ఘోషించినది.
మ:-
ఉదితే దృఙ్మధు మాస వంచితుడనేమో సీత జీవించి యు
న్నదటన్నాశయు లేదు నాకును అరణ్యానీ సమాసన్న సం
పదయౌ బాల రసాల సూన విభవ ప్రాకృష్ట సృష్ట్యాదిమో
హ దళత్కామము గాక దైత్యులు సతిన్ ప్రాణాలతో నుంతురా? (వి. రా. క. వృ. కి. నూ. 21)

ఈ వసంతం నన్ను వంచించడం వల్ల సీత జీవించి యున్నదని అనుకొంటున్నానేమో! అసలామె ప్రాణాలతో ఉన్నదా! ఈ అదవికి కొత్తగా వచ్చిన సంపద యైన ఈ గున్న మామిడి పూత నాలో సృష్ట్యాది సహజమైన కామమును రెచ్చ కొట్టినది కాని రాక్షసులు సీతను అసలు ప్రాణాలతో ఉంచి ఉండరు, అని రాముడు నిస్పృహుడై సీత యునికినే శంకించును. అడవికి కొత్తగా వచ్చిన సంపద గున్న మమిడి పూత యొక్క సౌందర్యము రాముణ్ణి మిక్కిలి మోహ పరచినవి. చైత్ర వైశాఖ మాసము లందు అడవి అంతయు వసంత శోభతో వెలిగిపోవుతున్నది.

ఈ పద్యంలో అడవికి కొత్తగా వచ్చిన సంపద అనగా వసంతముతో పాటు సీతయు స్ఫురించును. మరియు సీత లేత గున్న మావి పూవు వలె అత్యంత సుకుమారి. సౌందర్యవతి. అట్టి సీత కాముకులైన రాక్షసుల చేతిలో పడినది. అసలు సీతను రాక్షసులు బ్రతుకనిత్తురా! అన్నది రాముని ఆవేదన.

బాల రసాల సూనము నాలో మన్మధ వాంఛను రెచ్చగొట్టినదని రాముడు పలుకు చున్నాడు. అరవిందం - అశోకం - చూతం - నవమల్లిక - నీలోత్పలం , ఇవి మన్మధుని బాణాలు. ఈ బాణాలలో చూత మనగా మావి పూత. సమ్మోహనము కలిగిస్తుంది. అందుకే విశ్వనాధ ఈ మధు మాసము చేత నేను వంచింప బడుచున్నానేమో అని రాముని చేతనే అనిపించెను.

పద్యములను పదే పదే పఠించి, భావించగా సహృదయుని మనస్సులో అనేకానేక ఆలోచనలు ఉద్భవించి, ఆనందము కలిగించును. అప్పుడే కదా సాహిత్యం ఆలోచనామృతం అన్న మాట సార్థకం అవుతుంది!

చూచాం కదండి శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వెలువరించిన విశ్వనాధ కల్ప వృక్షంలో నిబిడీకృతమై యున్న భావుకతని? మరో పర్యాయం మరో పద్యం తెలిపే ప్రయత్నం చేయగలను.

జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.